Amaravathi Re-launch: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్కు అధికార కూటమి ఆహ్వానం – ప్రధాని మోదీ సభకు హాజరయ్యేనా?
ఏపీలో రాజకీయ ఉత్సాహాన్ని రెట్టింపు చేసే పరిణామం ఇది. మే 2న అమరావతిలో జరగబోయే పునర్నిర్మాణ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికార ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఆహ్వానం పంపింది.
అమరావతిని ప్రజల కలల రాజధానిగా మళ్లీ తీర్చిదిద్దేందుకు కేంద్రం, రాష్ట్రం కలసి చేపట్టిన రీ-లాంచ్ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో జగన్కు కూడా ఆహ్వానం పంపడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
తాడేపల్లిలోని జగన్ నివాసానికి ప్రోటోకాల్ అధికారులు
ఆహ్వాన పత్రికను వ్యక్తిగతంగా అందించేందుకు ప్రభుత్వ అసిస్టెంట్ ప్రోటోకాల్ అధికారి ఫజల్ స్వయంగా బుధవారం సాయంత్రం తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లారు. అయితే జగన్ అందుబాటులో లేకపోవడంతో ఆయన వ్యక్తిగత కార్యదర్శి కె. నాగేశ్వర రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేశారు. ప్రోటోకాల్ అధికారులు జగన్ అపాయింట్మెంట్ కోరినప్పటికీ, ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల పీఏకి ఇచ్చినట్లు నిర్ధారించారు.
జగన్ హాజరు అవుతారా?
ఆహ్వానం పంపిన తర్వాత, ప్రధాన ప్రశ్న – జగన్ ఈ కార్యక్రమానికి హాజరు అవుతారా?.. రాజధాని అమరావతిపై గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న వైఖరి, మూడు రాజధానుల భావన నేపథ్యంలో, ఈ ఆహ్వానం ఆయనకు విధేయతా పరీక్షలా మారనుందన్నది రాజకీయ వర్గాల విశ్లేషణ. అధికార పక్షం విభేదాలను పక్కన పెట్టి మాజీ సీఎం స్థాయికి గౌరవం ఇస్తూ ఆహ్వానం పంపడం గమనార్హం.
రాజకీయ శత్రుత్వం కంటే ప్రజల ప్రయోజనాలకే ప్రధానం అన్న సంకేతమా?
ఈ ఆహ్వానం ద్వారా కేంద్రం, రాష్ట్రం వైఎస్ జగన్ను కూడా ప్రాజెక్టులో భాగం చేయాలని భావించడం, “అమరావతి అన్నది కేవలం ఓ పార్టీది కాదు, తెలుగు ప్రజల కల” అన్న సంకేతాన్ని ఇస్తోంది.
ఇక మే 2న జరిగే సభలో జగన్ హాజరైతే, అది ఏపీలో రాజకీయ ఆధిపత్య ధోరణిని కొంతమేర తగ్గించే అవకాశముంటుంది. లేకపోతే, మరోసారి వైసీపీ ఆలోచనా విధానం వేరన్న సంకేతాన్ని ఇస్తుందన్న చర్చలకు తావుంటుందని విశ్లేషణలు ప్రారంభం అయ్యాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..