అనంతపురం నగరంలోని కె.ఎస్.ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో ఒకే రోజు పదిమంది విద్యార్థినులను ఎలుకలు కొరికాయి. హాస్టల్ రూమ్లో రాత్రిపూట నిద్రిస్తున్న సమయంలో ఎలుకలు కొరికాయని కళాశాల హాస్టల్ విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా పదిమంది విద్యార్థినుల చేతులు, కాళ్లపై ఎలుకలు కొరికి గాయపరిచాయి. ఈ సంఘటన బయటకు పొక్కకుండా కళాశాల ప్రిన్సిపల్ సత్యవతి అత్యంత గోప్యంగా విద్యార్థినులను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి టీకాలు వేయించారు. హాస్టల్ పరిసరాల్లో అపరిశుభ్ర వాతావరణం వల్ల హాస్టల్ గదిలోకి ఎలుకలు వస్తున్నాయని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా హాస్టల్ వెనుక వైపు డ్రైనేజీ నుంచి ఎలుకలు హాస్టల్ గదుల్లోకి కలుగు రంధ్రాల ద్వారా వస్తున్నాయని విద్యార్థినిలు అంటున్నారు.
ఒకేరోజు పదిమంది విద్యార్థినులను ఎలుకలు కొరకడంతో… హాస్టల్ పరిసరాలను శుభ్రం చేసి… ఎలుకలు రాకుండా కళాశాల యాజమాన్యం చర్యలు తీసుకుంది. అయితే అసలు కాలేజీ హాస్టల్ గదుల్లోకి ఎలుకలు రావడానికి విద్యార్థినులే కారణం అంటున్నారు హాస్టల్ వార్డెన్. విద్యార్థినిలు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న తినుబండారాలు… స్నాక్స్ ఎక్కడబడితే అక్కడ పడేయడం వల్లే హాస్టల్ గదిలోకి ఎలుకలు వస్తున్నాయని ఆమె చెబుతున్నారు. మొత్తం మీద ఒకే రోజు పదిమంది విద్యార్థినులను హాస్టల్ గదుల్లో నిద్రిస్తున్న సమయంలో ఎలుకలు కొరకడం అన్నది… హాట్ టాపిక్గా మారింది. ఎలుకలు అత్యంత చాకచక్యంగా కొరుకుతాయి. ఆ సమయంలో చీమ కుట్టినట్లు కూడా ఉండదు. అందుకే నిద్రలో విద్యార్థినిలకు అవి కొరుకుతున్న విషయం తెలియలేదని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..