భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల తర్వాత హైదరాబాద్లో భారీ పేలుళ్లకు ప్లాన్ చేసిన ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. పేళుల్లు జరిపేందుకు ప్రయత్నించిన విజయనగరానికి చెందిన చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్తో పాటు సికింద్రాబాద్లోని బోయిగూడకు చెందిన సయ్యద్ సమీర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వీరికి అంతర్జాతీయ స్థాయిలోని ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. తాజాగా లభించిన ఆధారాల ప్రకారం ఆ ఇద్దరూ అల్ హింద్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ సంస్థకు చెందిన వారిగా పోలీసులు కనిపెట్టారు.
- పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు..
ఇక ఈ ఇద్దరికి ఉన్న సంబంధాలపై లోతైన దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. వీళ్లు చిన్నప్పటి నుంచే ఉగ్రవాదంపై మక్కువతో ఉన్నారని పోలీసులు గుర్తించారు. వీళ్ల పని భారత్ను ఇస్లామిక్ దేశంగా మార్చెయ్యడం. బాంబులు పెట్టి ముస్లిమేతరులను హతమార్చాలి. ఇదే సిరాజ్, సమీర్ల జీవితాశయం. ఒళ్లంతా ఉగ్ర విషం నింపుకున్న వాళ్లిద్దరికి నిరంతరం ఇవే ఆలోచనలు, ప్రణాళికలు వేస్తుండేవారట. విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్లో ఉండే సమీర్ 24 గంటలు ఇదే మాట్లాడుకునేవాళ్లట. ముస్లిమేతరులను ఎలా అంతమొందించాలి అనేదే లక్ష్యంగా పెట్టుకుని వీళ్లు పనిచేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఉప్పా యాక్ట్ కింద వీరిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
- నిందితులకు వారం రోజుల కస్టడీ విధింపు…
ఇక కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సిరాజ్, సమీర్లను వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించాలని కోరగా న్యాయస్థానం దానికి అనుమతించింది.ఈ మేరకు కేసులో నిందితులుగా ఉన్న ఏ1 సిరాజ్, ఏ2 సమీర్లను న్యాయస్థానం వారం రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది. కోర్టు అనుమతితో ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న వీరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విజయనగరం తరలించనున్నారు. అక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షల తర్వాత కస్టడీకి తీసుకొని విచారించనున్నారు. అయితే కస్టడీలో నిందితులపై ఎలాంటి థర్డ్ డిగ్రీ వంటి చర్యలు చేపట్టవద్దని కోర్టు షరతులు విధించింది. కస్టడీ ముగిసిన తరువాత నిందితులను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, పేలుళ్ల కుట్ర కేసుకు సంబంధించి పోలీస్ కస్టడీలో సిరాజ్, సమీర్లు ఎలాంటి కీలక విషయాలు బయటపెడతారో చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..