అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ హత్య పలు అనుమానాలకు దారితీస్తోంది. 33 ఏళ్ల గంగాధర్ దారుణ హత్యలో అసలు నిజాలు రాబట్టే పనిలో పోలీసులు సొంత మనసులనే అనుమానిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న గంగాధర్ ను భార్య బిడ్డల ముందే బండ రాళ్లతో కొట్టి హత మార్చిన దుండగుల అసలు టార్గెట్ ఏంటన్న దానిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. రాత్రి 11 గంటల సమయంలో ఇంట్లోకి చొరబడ్డ ఆరుగురు వ్యక్తులు గంగాధర్ ను భార్య వనిత కళ్ళ ఎదుటే కర్రలతో దాడి చేసి బండ రాళ్లతో కొట్టి హత మార్చారు. హత్యకు గురైన గంగాధర్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మదనపల్లి రూరల్ పోలీసులు హత్యకు గల కారణాలపై లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
గంగాధర్ కు ఉన్న శత్రుత్వం, గొడవలపై ఆరా తీసిన పోలీసులు భార్యను కూడా అనుమానిస్తున్న పరిస్థితి ఏర్పడింది. గంగాధర్ భార్య వనితను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు, మరికొందరు అనుమానితులు కూడా విచారణ పేరుతో పీఎస్కు తరలించారు. భార్య సహకారంతో పక్కా స్కెచ్ తోనే హత్య జరిగినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్న పోలీసులు, ఈ మేరకు సాక్షాలను సేకరించే పనిలో పడినట్లు తెలుస్తోంది. సినిమా థ్రిల్లర్ను తలపించే కేసు గానే పోలీసుల విచారణ కూడా కొనసాగుతోంది. గంగాధర్ ను హత మార్చిన వారెవరో కనగొనే పనిలో ఉన్న పోలీసులు తొందర్లోనే మిస్టరీని చేధిస్తామని చెబుతున్నారు. గంగాధర్ హత్య కేసులో భార్య ప్రమేయం ఉందా… లేదా అన్న కోణంతో పాటు ఆరుగురు అగంతుకులు కలిసి చేసిన ఈ హత్య వెనుక ఉన్నదెవరన్నదే పోలీసులకు సైతం మిస్టరీగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..