అమరావతి, మే 18: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు 2025 రేపట్నుంచి (మే 19వ తేదీ) నుంచి ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను కూడా పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈ పరీక్షలు మే 18 నుంచి 28 వరకు జరగనున్నాయి. ఇక ఓపెన్ స్కూల్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా ఇదే తేదీల్లో అంటే మే 19 నుంచి 24 వరకు నిర్వహించనునున్నారు. ఈ మేరకు ఇప్పటికే పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ.. విద్యార్ధులందరూ పరీక్షలు బాగారాసి ఉత్తీర్ణత సాధించాలని సూచించింది. పరీక్షల్లో మాస్ కాపీయింగ్, పేపర్ లీకేజీలు జరగకుండా పటిష్ఠమైన ఏర్పాట్లు చేశారు. అన్ని పరీక్షా కేంద్రాలను సీసీ కెమెరా నిఘాలో ఉంచారు. తాగునీరు అందుబాటులో ఉంచాలని, విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని ఆయా జిల్లాల కలెక్టర్లు అధికారులకు సూచించారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, చరవాణులకు పరీక్షా కేంద్రాల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని అన్నారు.
పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులు అధికారిక వెబ్సైట్ నుంచి లేదా మనమిత్ర వాట్సప్ 95523 00009 నుంచి నేరుగా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే విద్యార్ధులు చదువుతున్న పాఠశాల ప్రిన్సిపల్ లేదా హెడ్ మాస్టర్ నుంచి కూడా హాల్ టికెట్లు పొందొచ్చు. రెగ్యులర్ విద్యార్ధులతోపాటు ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి విద్యార్థులు తమ వివరాలను నమోదు చేసి వీటిని పొందొచ్చు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.
ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల 2025 పూర్తి టైం టేబుల్ ఇదే..
- మే 19వ తేదీన ఫస్ట్ ల్యాంగ్వేజ్ పేపర్ 1
- మే 20వ తేదీన సెకండ్ ల్యాంగ్వేజ్
- మే 21వ తేదీన ఇంగ్లీష్
- మే 22వ తేదీన గణితం
- మే 23వ తేదీన భౌతిక శాస్త్రం
- మే 24వ తేదీన జీవ శాస్త్రం
- మే 26వ తేదీన సామాజిక అధ్యయనాలు
- మే 27వ తేదీన ఫస్ట్ ల్యాంగ్వేజ్ పేపర్ 2, OSSC మెయిన్ ల్యాంగ్వేజ్ పేపర్ I
- మే 28వ తేదీన OSSC మెయిన్ ల్యాంగ్వేజ్ పేపర్ 2, SSC ఒకేషనల్ కోర్సు
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి 2025 రీకౌంటింగ్ ఫలితాలు విడుదల
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల రీవెరిఫికేషన్, రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకున్న వారికి ఫలితాలను వెల్లడించారు. వీటి ఫలితాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసులురెడ్డి తెలిపారు. విద్యార్ధుల నుంచి మొత్తం 66,421 జవాబుపత్రాల దరఖాస్తులు రాగా.. ఇందులో 47,484 జవాబుపత్రాల ఫలితాలను విడుదల చేశామని అన్నారు.
ఇవి కూడా చదవండి
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి రీకౌంటింగ్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.