ఈజీమనీ వేటలో కొంతమంది ఆన్లైన్ గేమింగ్కి, బెట్టింగ్కి అడిక్ట్ అవుతున్నారు. లక్కు కలిసి వస్తుందనే ఆశతో లక్షల రూపాయలు బెట్టింగ్లకు తగలేస్తున్నారు. లక్కీ భాస్కర్ మాటదేవుడెరుగు.. అప్పుల్లోంచి కోలుకునే మార్గం కనబడక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తాజాగా బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకొని ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఆంధ్ర ప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పవన్ బేగంపేట్ లో ఓ సాఫ్ట్వేర్ సంస్థ లో పని చేస్తున్నాడు. అతని స్నేహితులతో పాటు ఎల్లారెడ్డి గూడాలోని ఓ బాయ్స్ హాస్టల్ లో ఉంటున్నాడు. హఠాత్తుగా సోమవారం ఉదయం బాత్రూంలో సూసైడ్ చేసుకున్నాడు. ఉదయం బాత్రూమ్లోకి వెళ్లిన పవన్ ఎంతకీ బయటికి రాకపోవడంతో స్నేహితులకు అనుమానం వచ్చి చూడగా అప్పటికే చనిపోయి ఉన్నాడు పవన్
పవన్ సెల్ఫోన్ పరిశీలించడంతో బెట్టింగ్ యాప్ ల మెసేజ్ లు ఉన్నట్లు గుర్తించారు. ఇటీవలే పవన్ తండ్రి అప్పులు చెల్లించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు మధురానగర్ పోలీసులు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహం అప్పగించడంతో పశ్చిమగోదావరి జిల్లాకు తరలించారు.
ఆన్లైన్ గేమ్లు కావొచ్చూ.. బెట్టింగ్లు కావొచ్చూ.. మొదట్లో చిన్న మొత్తంలో పెట్టి గెలుస్తారు. ఆ తర్వాత మెల్లి మెల్లిగా పొగొట్టుకుంటారు. పోయింది తిరిగి రాబట్టుకోవాలని మళ్లీ మళ్లీ ఆడుతారు. అదో విష వలయం. దానికి అడిక్ట్ అయితే అందులోంచి బయటపడటం అసాధ్యం. ఆ ఊబిలోంచి బయటపడలేకే పవన్ లాంటి యువకులు తనువు చాలిస్తున్నారు.
బెట్టింగ్లకు అలవాటు పడి చావుని కొనితెచ్చుకోవడం సరికాదంటున్నారు నిపుణులు. తప్పులు ఒప్పుకుని దాన్నుంచి బయటపడాలంటున్నారు. అదే సమయంలో ప్రభుత్వాలు ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్లను బ్యాన్ చేయాలంటున్నారు