భద్రాద్రి రామాలయంలో అన్యమత ప్రచార వివాదం నెలకొంది. ఆలయ ప్రాంగణంలోని శేష వస్త్రాల విక్రయ దుకాణంలో అన్యమత ప్రచార సంచిలో పెట్టి వస్త్రాలు విక్రయించడం భక్తులను ఆందోళనకు గురి చేసింది. భక్తులు దైవ దర్శనానికి వచ్చినప్పుడు మొక్కులు చెల్లించుకోవడంలో భాగంగా సీతారాముల వారికి వస్త్రాలను సమర్పిస్తుంటారు. అయితే దుకాణ దారులు పట్టు వస్త్రాలను అన్యమత ప్రచార స్లోగన్ ముద్రించి ఉన్న కవర్లలో పెట్టి ఇవ్వడం కలకలం రేపుతోంది. భక్తుడి ఫిర్యాదుతో అన్యమత ప్రచారం వెలుగులోకి వచ్చింది.
రామయ్య దర్శనానికి వచ్చిన గుంటూరుకు చెందిన భక్తులు రెండు చీరలను కొనుగోలు చేశారు. దుకాణంలో పని చేస్తున్న వారు వీటిని రెండు సంచుల్లో పెట్టి భక్తులకు అందించారు. కొద్దిసేపటి తర్వాత ఆ సంచులపై ఉన్న అన్యమత ప్రచార స్లోగన్ చూసి భక్తులు అవాక్కయ్యారు. ఇదేంటని అడిగితే దుకాణదారు నుంచి సరైన సమాధానం రాలేదని, దీంతో తమకు ఎదురైన చేదు అనుభవం గురించి ఆలయ అధికారికి ఫిర్యాదు చేసినట్టు భక్తులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఆలయ సిబ్బంది దుకాణాన్ని పరిశీలించి అక్కడ కొన్ని సంచులపై అన్యమత ప్రచార స్లోగన్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వాటిని అక్కడి నుంచి తీసేసినట్టు సమాచారం. ఆలయ ప్రాంగణంలో ఉన్న దుకాణాలపై ఆలయ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అన్యమత ప్రచార సంచులను ఏదో ఒక రూపంలో భక్తులకు అంటగట్టి అపచారం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై దర్యాప్తు చేసి బాధ్యతులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..