హైదరాబాద్లోని మెట్రో ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. మెట్రో ఛార్జీల పెంపు హైదరాబాద్లో నిత్యం రాకపోకలు సాగించే పేద, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని లేఖలో వారు పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో ప్రారంభమైన మెట్రోను నగరంలోని ప్రజలు తమ ప్రధాన రవాణా మార్గంగా వినియోగిస్తున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మెట్రో టికెట్ ధరలను రూ.10 నుంచి రూ.20 వరకు పెంచితే నగరంలో నివసిస్తున్న సాధారణ ప్రయాణికుడి నెలసరి మెట్రో ప్రయాణం ఖర్చు రూ.500 నుంచి రూ.600 వరకు పెరుగుతుందని.. ఇది కుటుంబ బడ్జెట్పై ప్రభావం చంపుతుందని పేర్కొన్నారు.
ప్రజా రవాణా వ్యవస్థల మొదటి ఉద్దేశం ప్రజలకు సరసమైన ధరలు అందుబాటులో ఉంచడం, వేగవంతమైన, నమ్మకమైన రావాణ సేవలను అందించడమేనని అన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం దానికి విరుద్ధంగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. అభివృద్ధి చెందిన అంతర్జాతీయ నగరాల్లోని ప్రభుత్వాలు సబ్సిడీలు ఇచ్చి మరీ ప్రజా రవాణా వ్యవస్థలను ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్ను విశ్వ నగరంగా తీర్చిదిద్ధాలనే లక్ష్యంతో పనిచేస్తున్నప్పుడు నగరంలోని ప్రజా రవాణాను బలోపేతం చేసి, ప్రజలకు తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరంఉందని లేఖలో పేర్కొన్నారు.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పేద, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని.. దీన్ని దృష్టిలో పెట్టుకొని మెట్రో ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ప్రైవేటు కంపెనీల లాభనష్టాల లాభాల గురించి కాకుండా, ప్రజల గురించి ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..