ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం ఉదయం సింగపూర్ చేరుకున్నారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన ప్రవాసాంధ్రులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ఐదు రోజుల సింగపూర్ పర్యటనలో 29 అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు చంద్రబాబు. చంద్రబాబు వెంట మంత్రులు లోకేష్, నారాయణ, టీజీ భరత్తో పాటు పలువురు అధికారులున్నారు. ఈ ఉదయం సింగపూర్లో ఇండియన్ హైకమిషనర్తో చంద్రబాబు బృందం భేటీ అవుతుంది. పలువురు ప్రారిశ్రామిక వేత్తలతో పాటు ప్రవాసాంధ్రులతో సమావేశం అవుతారు. ఈ రాత్రికి ఇండియన్ హైకమిషనర్ ఇచ్చే ఆతిథ్య విందులో చంద్రబాబు పాల్గొంటారు. పర్యటనలో భాగంగా సింగపూర్ అధ్యక్షుడితో పాటు మంత్రులు, పారిశ్రామిక వేత్తలతో భేటీలు ఉంటాయి.
2014 నుంచి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వంలో అమరావతి అభివృద్ధి కోసం సింగపూర్తో పలు ఒప్పందాలు జరిగాయి. సీఆర్డీఏ, సింగపూర్ సంస్థల కన్సార్షియం కలిసి అమరావతిలో స్టార్టప్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు గతంలో ఒప్పందం జరిగింది. అయితే జగన్ ప్రభుత్వంలో ఆ ఒప్పందాలు అటకెక్కాయి. వాటిని మళ్లీ ట్రాక్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇందులో భాగంగానే సింగపూర్లో చంద్రబాబు పర్యటిస్తున్నారు.
పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దిగ్గజ కంపెనీలు, పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇన్ఫ్రా ప్రాజెక్టలు, లాజిస్టిక్ కేంద్రాలను సందర్శిస్తారు. నవంబర్లో జరిగే విశాఖ సదస్సుకు సింగపూర్ పెట్టుబడిదారులను ఆహ్వానించనున్నారు. ప్రవాసాంధ్రులతో చంద్రబాబు సమావేశమవుతారు. విదేశీ పెట్టుబడులు, అమరావతి నిర్మాణం గురించి ప్రవాసీయులకు వివరించనున్నారు.