తెలంగాణ ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ లావాదేవీలు ఆన్లైన్లో జరుపుకునేందుకు వీలుగా 2020 అక్టోబర్లో ధరణి పోర్టల్ను తీసుకొచ్చింది. అప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా భూములకు సంబంధించిన అన్ని రకాల రిజిస్ట్రేషన్లు లావాదేవీలు ఈ ధరణి పోర్టల్ ద్వారానే జరిగాయి. ధరణి అందుబాటులోకి వచ్చాక రాష్ట్రంలోని ప్రభుత్వ భూములు, దేవాదాయ, వక్ఫ్ భూములు అన్ని ధరణి పరిధిలోకి వచ్చేశాయి. అయితే, ధరణి పోర్టల్ నిర్వహణ విదేశీ సంస్థలకు అప్పగించడంతో కొందరు ప్రైవేటు వ్యక్తులు రాష్ట్రంలోని భూ రికార్డులను తారుమారు చేసి తమ పేర్లపైకి మార్చుకున్నట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ధరణిలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో ధరణిలో భారీగా అక్రమాలు జరిగినట్టు గుర్తించింది.
ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే సుమారు 15 వేల ఎకరాల విలువైన ప్రభుత్వ భూములు మాయం అయినట్టు ప్రభుత్వం గుర్తించింది. ఈ భూముల విలువల సుమారు రూ.లక్ష కోట్లకుపైగా ఉంటుందని అంచనా వేసింది. అటవీ శాఖ ప్రకారం 22.74 లక్షల ఎకరాలు భూమి మాయమైనట్టు తెలింది. అయితే 2017లో జరిగిన భూరికార్డుల నవీకరణ ప్రకారం తెలంగాణలో 66.67 లక్షల ఎకరాల అటవీ భూమి ఉండాల్సి ఉంటే.. 43.93 లక్షల ఎకరాలే ఉన్నట్లు అటవీశాఖ తెలిపింది. రికార్డుల ప్రకారం తెలంగాణ అటవీ శాఖ నుంచి 22.74 లక్షల ఎకరాల భూములు మాయమయ్యాయని అధికారులు చెబుతున్నారు.
దీంతో వీటిపై నిజాలు నిగ్గుతేల్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో 2014 ముందున్న పాత రికార్డులను.. ప్రస్తుత స్థితిని పోల్చి సర్వే చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో 2014 నుంచి 2023 మధ్య రాష్ట్రంలో జరిగిన భూ లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఫోరెన్సిక్ ఆడిట్ తర్వాత నివేదిక ఆధారంగా తారుమారు అయిన భూముల వ్యవహారంపై చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..