
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కనీవినీ ఎరుగని స్థాయిలో భద్రతా ఏర్పాట్లు జరిగాయి. ట్రంప్ ప్రమాణ స్వీకార నేపథ్యంలో…అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. డ్రోన్లతో గగనతలంలో నిఘాను కట్టుదిట్టం చేశారు. డొనాల్డ్ ట్రంప్ సోమవారం మధ్యాహ్నం (భారత కాలమానం ప్రకారం.. రాత్రి 10.30 గంటలకు) పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే.. గతంలో జరిగిన నిరసన కార్యక్రమాలు, దాడులు, కొత్త ఏడాదిలో జరిగిన టెర్రరిస్టు దాడుల నేపథ్యంలో…భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎటు చూసినా బారికేడ్లు, కంచెలతో, వాషింగ్టన్ శత్రుదుర్భేద్యమైన కోటలా మారిపోయింది.
ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమంతో ముడిపడ్డ అన్ని ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆయా ప్రాంతాలను భద్రతా దళాలు దిగ్బంధించాయి. దీంతో ఎక్కడకు వెళ్లాలన్నా కారు దిగి మైళ్లకు మైళ్లు నడవాల్సిన పరిస్థితి వచ్చింది. అనేక భద్రతా వలయాలను దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలు తమతో పాటు ఎలాంటి బ్యాగులు తీసుకురావొద్దని అధికారులు ఆంక్షలు విధించారు. ఇక ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసే కాపిటల్, వైట్హౌస్ పరిసర ప్రాంతాలను పూర్తిగా మూసివేశారు. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి రాకపోకలను అనుమతించడం లేదు.
ట్రాఫిక్ నియంత్రణకు స్పెషల్ టీమ్స్
క్యాపిటల్ హిల్లోని రోటుండా ఇండోర్ ఆవరణలో ప్రమాణ స్వీకారం జరుగుతుంది. దేశం నలుమూలల నుంచి వేలాది మంది రిపబ్లికన్ పార్టీ అభిమానులు వాషింగ్టన్ చేరుకున్నారు. కానీ.. అత్యంత ప్రముఖులు మాత్రమే పట్టాభిషేకాన్ని ప్రత్యక్షంగా చూసే వీలుంది. భద్రతా సిబ్బందికి తోడు 7 వేల 800మంది గార్డ్ ట్రూప్స్ కూడా రంగంలోకి దిగారు. వాళ్లు, భారీ ప్రజా సమూహాలను నియంత్రించడంతో పాటు ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తారు. ఇక కెమికల్, బయోలాజికల్ లేదా ఇతర పేలుడు పదార్థాలతో దాడులు జరిగితే…క్విక్ రియాక్షన్ టీమ్స్ రంగంలోకి దిగుతాయి.
ప్రపంచ నలుమూలల నుంచి ప్రముఖులు..
అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని గంటల్లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రపంచ దేశాల అధినేతలు, ప్రతినిధులు, ప్రముఖ వ్యాపారవేత్తలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ నెల 18న అంబానీ దంపతులు అమెరికా చేరుకున్నారు. ఈ క్రమంలో ట్రంప్ ఏర్పాటు చేసిన క్యాండిల్లైట్ డిన్నర్లో అంబానీ దంపతులు పాల్గొన్నారు. ఈ విందుకు రావాలంటూ దాదాపు 100 మందికి ఆహ్వానం అందినట్లు సమాచారం. ఈ జాబితాలో భారత్ నుంచి అంబానీ దంపతులు మాత్రమే ఉన్నట్లు సమాచారం. కాగా.. భారత్ నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరుకానున్నారు.
వందలాది నిర్ణయాలు..
అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ సరిహద్దు భద్రత, ఇంధనం, అమెరికన్ కుటుంబాలకు జీవన వ్యయాలను తగ్గించడం పై దృష్టిసారించారు.. అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన తర్వాత తన కార్యాలయంలో మొదటి రోజు 200 కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం..
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..