ఇప్పుడు ఎవ్వరినీ నమ్మలేని రోజులు… మంచి టిప్ టాప్ గా రెడీ అయి చదువుకున్నవాళ్లలా ఉన్నా.. మీరు అప్రమత్తంగా ఉండాల్సిందే. ఇలాంటి వేషాల్లో ఈ మధ్య సమాజంలో చీటర్స్ పెరిగిపోయారు. తాజాగా సికింద్రాబాద్లోని వారాసిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ వయసు పై బడిన మహిళను టార్గెట్ చేసిన దుండగులు.. ఆమె ఇంట్లోకి ప్రవేశించి.. ఆమెను తాళ్లతో కట్టేసి బంగారం దోచుకుని వెళ్లారు. పార్శిగుట్టలో పారిజాతం అనే మహిళ ఒంటరిగా ఉండటాన్ని పసిగట్టారు దుండగులు.. మిట్ట మధ్యాహ్నం సమయంలో ఆమె ఇంటి వద్దకు వచ్చి డోర్ కొట్టారు. ఆమె తలుపు తీయగానే ఇల్లు అద్దె కోసం వచ్చినట్లు చెప్పారు. ఈ ఇల్లు కాదు.. పక్కన ఇంటికి వెళ్లాలని ఆమె చెప్పగా.. తాము ఆ ఇంటిని చూస్తామని లోపలికి వెళ్లారు. లోపలికి వెళ్లాక తెగబడి ఆమెను కుర్చీని కట్టేసి.. కత్తి చూపించి.. బంగారం, నగదు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని లేదంటే చంపేస్తామన్నారు.
ఆమె ఏం లేవని చెప్పగా కత్తి గొంతు వద్ద పెట్టారు. భయపడిన ఆ మహిళ మెడలోని పుస్తెల తాడు తీసి ఇచ్చింది. తర్వాత ఇంట్లోని బీరువాలో వెతికి లోపల దాచిన 3 తులాల బంగారం, 6 వేల డబ్బు దోచుకుని వెళ్లిపోయారు. కాసేపటికి తేరుకున్న మహిళ ఎలాగోలా కట్లను విడిపించుకుని.. బయటకు పరిగెత్తి వచ్చి.. బోరుబోరున ఏడుస్తూ స్థానికులకు జరిగిన విషయం చెప్పింది. వారి సాయంతో వారాసిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్ సేకరించి.. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్నారు. ప్రత్యేక బృందాలు నిందితులను గాలిస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.