తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. అవినీతి, అక్రమాస్తుల కేసుల నమోదులో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఏప్రిల్ నెలలో అంటే కేవలం 30 రోజుల్లో మొత్తం 21 కేసుల నమోదు అయ్యాయి. 13 ఏసీబీ ట్రాప్ కేసులు, 2 అక్రమాస్తుల కేసులు, 2 క్రిమినల్ కేసులు, 2 తనిఖీ కేసులు, 2 సాధారణ కేసులు ఫైల్ చేసింది. మొత్తంగా 20 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్, రిమాండ్ చేయబడ్డారు. ఇక సుమారు 5లక్షల రూపాయల సొమ్మును సీజ్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. అలాగే ఒక అధికారి ఇంట్లో సోదాలు చేసి 3.51 కోట్ల రూపాయల అక్రమాస్తులను గుర్తించినట్లు వెల్లడించారు.
ఇటు మాజీ ENC హరిరామ్ అక్రమాస్తులు మార్కెట్ వాల్యూ ప్రకారం 13.50 లక్షల ఆస్తులు గుర్తించాలని తెలిపారు. అలాగే మరికొన్ని కేసులను విజయవంతంగా పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే… 1064కు కాల్ చేయాలని ఏసీబీ అధికారులు మరోసారి విజ్ఞప్తి చేశారు. నెలలు మారినా అవినీతిపై తమ పోరాటం ఆగదన్నారు. మొత్తంగా… అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా తన దూకుడు ఏప్రిల్ నెలకు మాత్రమే పరిమితం కాదంటున్నారు అధికారులు. ప్రజలు కూడా తమకు సహకరించాలని… ఒక్కరూపాయి లంచం అడిగినా వెంటనే తెలియజేయాలని కోరుతున్నారు.