మేడ్చల్, ఫిబ్రవరి 17: మేడ్చల్ పట్ట పగలే నడి రోడ్డుపై దారుణం చోటు చేసుకుంది. సొంత అన్నను తమ్ముడు కత్తితో పొడిచి హత్య చేశాడు. బస్ డిపో ఎదుట జాతీయ రహదారిపై చిన్నాన కొడుకుతోపాటు తమ్ముడు వేటాడి కత్తులతో దాడి చేసి ప్రాణం పోయే వరకు కసి తీరా పొడిచి చంపారు. అందరూ స్తుండగానే ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కామారెడ్డి జిల్లా శ్రీ మాచారెడ్డికి చెందిన గుగులోతు గన్యా మేడ్చల్ ఆర్టీసీ డిపో డ్రైవర్గా పని చేస్తున్నాడు. గన్యాకు ఉమేశ్ (24), రాకేశ్ (22), హరిణి అనే ముగ్గురు సంతానం ఉన్నారు. ఉద్యోగ బాటలో కుటుంబంతో సహా మేడ్చల్కు వచ్చి, ఆర్టీసీ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. పెద్ద కొడుకు ఉమేశ్కు వివాహం జరిపించగా భార్య ప్రియాంక, ఇద్దరు పిల్లలతో వేరే అద్దె ఇంట్లో కాపురం ఉంటున్నారు. మిగిలిన రాకేశ్, హరిణి మాత్రం చదువకుంటున్నారు. అయితే ఉమేశ్ మద్యానికి బానిసై కుటుంబ సభ్యులను నిత్యం వేధించసాగాడు. ఇలా యేళ్లుగా ఉమేష్ తీరు మార్చుకోకుండా కుటుంబ సభ్యులతో గొడవలు లెత్తుతున్నాయి. తల్లిదండ్రులతో పాటు తమ్ముడు, భార్యపై కూడా దాడికి దిగుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం కూడా ఉమేశ్ మద్యం తాగి వచ్చి కుటుంబ సభ్యులతో మరోమారు గొడవ పడ్డాడు. దీంతో విసిగెత్తిపోయిన రాకేశ్, తన చిన్నాన్న కొడుకు అయిన లక్ష్మణ్, బంధువులు నవీన్, నరేశ్, సురేశ్తో కలిసి అన్న అద్దెకు ఉన్న ఇంటికి వెళ్లి అతడిపై దాడి చేశారు.
దీంతో భయకంపితుడైన ఉమేశ్ ఆర్టీసీ కాలనీ నుంచి జాతీయ రహదారిపై పరుగులు తీశాడు. రాజేశ్, లక్ష్మణ్ తరుముకుంటూ బస్ డిపో ఎదుట పట్టుకుని ఉమేశ్ను కత్తులతో పొడిచి హతమార్చారు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక తాపీగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. విషయాన్ని తెలుసుకున్న ఉమేశ్ తల్లి, భార్య పిల్లలతో సహ ఘటనా స్థలానికి చేరుకుని రోదించారు. మరోవైపు విధి నిర్వహణలో భాగంగా తూప్రాన్ వైపు వెళ్తున్న గన్యా విషయం తెలియడంతో డిపోకు చేరుకున్నాడు. సమాచారం అందుకున్న సీఐ సత్యనారాయణ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని మేడ్చల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఉమేష్ ఒంటిపై 12 కత్తిపోట్లు ఉన్నాయని, పోలీసులు వెళ్లేటప్పటికే ఉమేష్ మరణించాడని ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి మీడియాకు తెలిపాడు. మద్యానికి బానిసై కుటుంబ సభ్యులను తీవ్ర ఇబ్బంది పెడుతుండటంతో తమ్ముడు రాకేశ్, వరుసకు సోదరుడైన లక్ష్మణ్తో కలిసి ఉమేష్ను హత్య చేసినట్టు ప్రాథమిక విచారణలో పోలీసులు నిర్ధారించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.