హైదరాబాద్ బేగంపేట పరిధిలోని సన్ స్టీల్ దుకాణంలో రెండు రోజుల క్రితం భారీ చోరీ జరిగింది. దుకాణం లాకర్లోని 48లక్షలు ఎత్తుకెళ్లారని యజమాని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు బేగంపేట పోలీసులు. ఈ ఘటనను ఛాలెంజ్గా తీసుకున్న బేగంపేట పోలీసులు.. చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. దొంగతనం జరిగిన ఆరు గంటల్లోనే చోరీకి పాల్పడిన దొంగను అరెస్టు చేశారు. గతంలో దుకాణంలో పనిచేసిన గిరిధర్సింగ్ను దొంగగా తేల్చారు. లాకర్లోని డబ్బులు పోవడం వెనుక షాపులో పనిచేసేవారి హస్తం ఉంటుందనే అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించడంతోపాటు.. మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలించారు.
సమీపంలోని దాదాపు 30 సీపీ కెమెరాలను జల్లెడ పట్టారు. మేడ్చల్లో ఓ దాబా యజమాని ఇచ్చిన సమాచారంతో కేసును చేధించారు. మధ్యప్రదేశ్ చెందిన గిరిధర్సింగ్ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ఆదిలాబాద్ మీదుగా పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో పట్టుకున్నామన్నారు నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్. ఆర్టీసీ బస్సు డ్రైవర్ డీటెయిల్స్ తీసుకొని బస్సు జీపీఎస్ ట్రాక్ చేశామని.. అదిలాబాద్ పోలీసుల సహకారంతో కేసు త్వరగా ట్రేస్ అయిందన్నారు. నిందితుడికి షాప్ ఎంట్రీ.. ఎగ్జిట్లు ముందే తెలియడంతో ఈజీ ఎస్కేప్ అయ్యాడని.. అలాగే.. భవనంలోకి వెళ్లే దగ్గర చాలా గ్యాప్ ఉండడంతో లోపలికి వెళ్లి చోరీకి పాల్పడ్డాడని వెల్లడించారు. నిందితుడు గిరిధర్ సింగ్ నుంచి 48లక్షల రూపాయల నగదును రికవరీ చేసినట్లు డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..