భారతీయ రైల్వేశాఖ సరికొత్త రైళ్లను ప్రవేశపెడుతోంది. ఇప్పటివరకు డీజిల్, విద్యుత్ రైళ్లు నడుస్తుండగా.. హైడ్రోజన్తో నడిచే తొలి రైలు అందుబాటులోకి రాబోతోంది. దానిలో భాగంగా.. దేశంలోనే తొలి హైడ్రోజన్ రైళ్లను ప్రారంభించేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 31 నాటికి హర్యానాలోని జింద్- సోనిపట్ మార్గంలో పరుగులు తీసేలా చర్యలు తీసుకుంటోంది. రీసెర్చ్, డిజైన్, స్టాండర్డ్ అనే సంస్థ భారతదేశపు తొలి హైడ్రోజన్ శక్తితో నడిచే రైలు డిజైన్ను రూపొందించింది. ఇది రైలు రవాణాలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. ఈ రైలులో హైడ్రోజన్ సిలిండర్లను నిల్వ చేసేందుకు, ఇంటిగ్రేటెడ్ ఫ్యూయల్ సెల్ కన్వర్టర్లు, ఎయిర్ రిజర్వాయర్లను ఉంచేందుకు మూడు ప్రత్యేక కోచ్లను అధికారులు ఏర్పాటు చేశారు.
ఈ రైలు గరిష్ఠంగా గంటకు 110 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ ఇన్నోవేషన్ కింద హైడ్రోజన్ పవర్తో నడిచే 35 రైళ్లను నడపాలని భారతీయ రైల్వే భావిస్తోంది. ప్రతి రైలుకు దాదాపు 80 కోట్లు ఖర్చు అవుతోంది. గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అదనంగా 70కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తోంది. హెరిటేజ్, హిల్స్టేషన్స్ రూట్స్లో ఈ రైళ్లను నడపేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
హైడ్రోజన్తో నడిచే రైళ్లతో సున్నాశాతం కార్బన ఉద్గారాలు రిలీజ్, ఎక్కువ సామర్థ్యం, దీర్ఘకాలిక ఖర్చు ఆదా, సౌండ్ పొల్యూషన్ తక్కువ లాంటి ఎన్నో లాభాలున్నాయి. హైడ్రోజన్, ఆక్సిజన్ విద్యుత్ను ఉత్పత్తి చేసి.. వాటి ద్వారా నీటి ఆవిరిని విడుదల చేసే టెక్నాలజీతో ఈ హైడ్రోజన్ రైలు నడుస్తుందని అధికారులు తెలిపారు.
40 వేల లీటర్ల నీటిని ఈ హైడ్రోజన్ రైలు ఉపయోగించుకోనుంది. ఒకసారి ట్యాంక్ నింపితే వెయ్యి కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని అధికారులు వెల్లడించారు.. కాగా.. తొలిసారి హైడ్రోజన్తో నడిచే రైలు అందుబాటులోకి రానుండటంతో అందరిచూపు దీనిపైనే ఉంది..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..