ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం నాలుగో రోజుకు చేరుకుంది. తగ్గేదే లే అంటున్నాయి రెండు దేశాలు.. పోటాపోటీగా మిస్సైళ్ల దాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ గగనతలంపై పూర్తి ఆధిపత్యం సాధించామని ఇజ్రాయెల్ ప్రకటించింది. రెండు దేశాలు వెంటనే రాజీకి రావాలని మరోసారి పిలుపునిచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇజ్రాయెల్కు సిరియా, జోర్డాన్ లాంటి ముస్లిం దేశాలు కూడా మద్దతిస్తున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దంపై పాకిస్తాన్ మాట మార్చింది. ఇజ్రాయెల్పై అణుదాడి చేస్తామన్న వార్తలో నిజం లేదని పాకిస్తాన్ ప్రకటించింది. తమ అణ్వాయుధాలను వేరే దేశానికి ఇచ్చే ప్రసక్తే లేదని పాకిస్తాన్ విదేశాంగశాఖ వెల్లడించింది. తమ గగనతలాన్ని వాడుకోవడానికి ఇజ్రాయెల్కు అనుమతి ఇచ్చింది సిరియా ప్రభుత్వం. టెల్అవీవ్ లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ క్షిపణి దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ దాడిలో స్వల్ప నష్టం మాత్రమే జరిగినట్టు తెలుస్తోంది.
ఇరాన్ ఖండాంతర క్షిపణుల ప్రయోగంతో ఇజ్రాయెల్ లోని కీలక నగరాల్లో పెను విధ్వంసం జరిగింది. భారీ అంతస్తుల భవనాలు నేలమట్టమయ్యాయి. ఇరాన్ తాజా క్షిపణి దాడులతో ఇజ్రాయెల్ పౌరులకు తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్పై నమ్మకం లేకుండా పోతోంది. ఇజ్రాయెల్ దాడిలో 224 మంది పౌరులు చనిపోయారని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇరాన్ దాడిలో 24 మంది ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారు. ఇజ్రాయెల్ మరోసారి టెహ్రాన్పై నాలుగు దిక్కుల నుంచి భీకర దాడులు చేసింది. పర్వత ప్రాంతాలపై కూడా బాంబులవర్షం కురిపించింది.
టెల్ అవీవ్ , టెహ్రాన్ మధ్య జరుగుతున్న భీకరపోరును ఆపడానికి ఐక్యరాజ్యసమితి చేస్తున్న ప్రయత్నాలు ఫలిండచం లేదు. ఇరాన్ క్షిపణులు , డ్రోన్ల ధాటికి ఇజ్రాయెల్ ఐరన్డోమ్ పనిచేయకుండా పోయింది. ఇరాన్ దాదాపు 100 ఖండాంతర క్షిపణులను ఇజ్రాయోల్పై ప్రయోగించింది. ఫతా-1 , ఫతా-2 , ఖోరం షహర్ , ఇమాద్ లాంటి సూపర్ సోనిక్ క్షిపణులతో ఇరాన్ ఇజ్రాయెల్పై దాడి చేసింది. వీటిలో కొన్ని మిస్సైళ్ల రేంజ్ 15000 – 18000 కిలోమీటర్ల రేంజ్ను కూడా కలిగి ఉన్నాయి. అయితే ఇరాన్ ఈసారి ఐడీఎఫ్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని టార్గెట్ చేసుకుంది.
మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను హత్య చేయడానికి ఇరాన్ కుట్ర చేసిందన్నారు. ఇరాన్ అణు స్థావరాలను ధ్వంసం చేసే వరకు తమ దాడులు కొనసాగుతాయని ప్రకటించారు. తాము ఇరాన్ పౌరులను టార్గెట్ చేయడం లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా తమ దేశంలో ఉంటూ ఇజ్రాయెల్కు సైనిక సమాచారం చేరవేస్తున్న మెసాద్ ఏజెంట్లను ఇరాన్ ప్రభుత్వం ఉరితీసింది.
మరోవైపు రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితుల వేళ ఇరాన్లో చిక్కుకున్న 10 వేల మంది భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. భూమార్గంలో వారిని ఆఫ్గనిస్తాన్ టుర్కిమెనిస్తాన్ , అజర్బైజాన్ తదితర దేశాల మీదుగా భారత్కు తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..