భార్య చేతిలో మరో భర్త బలయ్యాడు. ఇలాంటి సంఘటనలు ఇటీవల తరుచూ వినిపిస్తున్నాయి. ఇలాంటి ఘటననే మరోసారి కరీంనగర్ జిల్లాలో వెలుగుచూసింది. అనైతిక సంబంధానికి అడ్డు వస్తున్నారనే కారణంతో భర్తను అత్యంత పాశవికంగా హత్య చేయించింది ఓ భార్య. ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసలు… ఇందులో పాల్గొన్న మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
కరీంనగర్ నగర శివారులోని బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద రైల్వే ట్రాక్ పక్కన జరిగిన హత్య కేసు మిస్టరీని కరీంనగర్ రూరల్ పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
జులై 29న కరీంనగర్లోని సుభాష్ నగర్కు చెందిన ఐలవేణి సంపత్ (45) రైల్వే ట్రాక్ పక్కన అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. గ్రంథాలయంలో స్వీపర్గా పనిచేసిన సంపత్, తన కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా మృతుడి భార్య ఐలవేణి రమాదేవి (38)పై అనుమానం రావడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు.
రమాదేవికి కిసాన్నగర్కు చెందిన కర్రె రాజయ్యతో వివాహేతర సంబంధం ఉంది. భర్త సంపత్ మద్యానికి బానిస కావడంతో తరచూ రమాదేవిని కొట్టేవాడు. దీంతో విసిగిపోయిన రమాదేవి, రాజయ్య, తన దూరపు బంధువైన ఖాదర్ గూడెంకు చెందిన కీసరి శ్రీనివాస్ లతో కలిసి సంపత్ను హత్య చేయాలని ప్లాన్ వేసింది. ప్లాన్ ప్రకారం, రాజయ్య, శ్రీనివాస్ కలిసి సంపత్ను బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్దకు రమ్మని చెప్పి, అక్కడ మద్యం తాగారు. సంపత్ పూర్తిగా మత్తులోకి వెళ్లిన తర్వాత, రమాదేవి ఫోన్ చేసి అతడిని చంపమని చెప్పింది.
రమాదేవి ఆదేశాల మేరకు రాజయ్య, శ్రీనివాస్ తమ వెంట తెచ్చుకున్న గడ్డి మందును సంపత్ చెవిలో పోసి హత్య చేశారు. సంపత్ చనిపోయాడని నిర్ధారించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత, రమాదేవి, రాజయ్య, శ్రీనివాస్ ముగ్గురూ కలిసి సంపత్ కోసం వెతుకుతున్నట్లు నటించారు. చివరికి సంపత్ మృతదేహం ఉన్న ప్రాంతాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. హత్యకు ఉపయోగించిన రెండు మోటార్ సైకిళ్లు, మూడు సెల్ ఫోన్లను, మద్యం బాటిళ్లు , గడ్డి మందు డబ్బాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తు చేసిన పోలిసులను కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభినందించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..