సరిగా పండని లీచీ పండ్లను తినడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలో అనూహ్యమైన మార్పులు జరగవచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లలలో ఇది తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఒక్కసారిగా బలహీనత, తలనొప్పి, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇది హైపోగ్లైసీమియాకు దారి తీసి తీవ్రమైన పరిస్థితులు ఏర్పడవచ్చు.
కొంతమందికి లీచీ పండ్లు తిన్న వెంటనే చర్మంపై దద్దుర్లు, వాపు, దురద, మంట లాంటివి రావొచ్చు. ఇది ఆ వ్యక్తి శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. కొన్నిసార్లు ఇది శ్వాసకోశ సమస్యలుగా కూడా మారే ప్రమాదం ఉంది. అలాంటి సందర్భాల్లో వెంటనే డాక్టర్ను కలవడం అవసరం.
ఈ పండ్లను ఎక్కువగా తింటే కొందరికి అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం లాంటి జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. లీచీలో ఉండే చక్కెరలు, ఫైబర్ పదార్థాలు కొన్నిసార్లు జీర్ణక్రియపై ఒత్తిడిని పెంచొచ్చు. వేసవిలో శరీరానికి చల్లదనం అవసరమే అయినా.. సరైన మోతాదులో ఈ పండ్లను తీసుకోకపోతే సమస్యలు వస్తాయి.
మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడుతున్నవారు లీచీ తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది రక్తంలోని షుగర్ లెవల్స్ ను ప్రభావితం చేయొచ్చు. కొన్ని మందుల పని తీరును కూడా తగ్గించొచ్చు. ఇది వారి ఆరోగ్యాన్ని మరింత మందగించడంతో పాటు పరిస్థితిని విషమంగా మార్చే ప్రమాదం కూడా ఉంది.
లీచీ పండ్లను అధికంగా తినడం వల్ల కొన్ని సందర్భాల్లో శరీర రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. దీని వల్ల శరీరం తనను తాను ప్రతికూలంగా ఎదుర్కొనే ఆటో ఇమ్యూన్ సమస్యలు రావొచ్చు. ఈ పరిస్థితి ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీసే ప్రమాదం కలిగిస్తుంది.
లీచీ పండ్లు సహజంగా శరీరానికి మంచివే అయినా.. వాటిని సమతుల్యంగా, తక్కువ మోతాదులో తీసుకోవడమే ఉత్తమం. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు, చిన్నపిల్లలు, జీర్ణ సమస్యలు ఉన్నవారు ఇవి తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)