
అమరావతి, మే 13: నైరుతి రుతుపవనాలు చురుకుగా ముందుకు కదులుతున్నాయి. రాబోయే 4 నుంచి 5 రోజుల్లో అండమాన్, నికోబార్ దీవులు, దక్షిణ, మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. అండమాన్ ప్రాంతంలో రుతుపవనాలు సాధారణంగా మే 21 నాటికి ప్రవేసిస్తుంటాయి. అయితే ఈ ఏడాది మాత్రం వారం ముందుగానే ప్రవేశించాయి. దీంతో గడచిన 24 గంటల నుంచి నికోబార్ దీవులలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఈ ఏడాది నికోబర్ దీవుల్లో వర్షపాతం క్రమంగా పెరిగే అవకాశం ఉంది. అక్కడ రాబోయే 24 గంటల్లో విస్తారంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
ఈ ప్రాంతాలలో వర్షపాతం కొనసాగే అవకాశం ఉన్నందున, నైరుతి రుతుపవనాలు మే 13 నాటికి అండమాన్ సముద్రం, దక్షిణ బంగాళాఖాతం,అండమాన్ & నికోబార్ దీవులలోని కొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. తదుపరి 4-5 రోజుల్లో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతం, దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, మొత్తం అండమాన్, నికోబార్ దీవులు, అండమాన్ సముద్రం, మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు మరింత వేగంగా రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది.
దీంతో అండమాన్ సమీపంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో బుధవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముంది. పరిస్థితులు అనుకూలిస్తే ఇది అల్పపీడనంగా మారుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా చెదురుమదురు వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. మంగళ, బుధవారాల్లో.. ఉత్తర కోస్తా, రాయలసీమ, గురువారం.. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావారణ కేంద్రం వెల్లడించింది. రాబోయే 5 రోజుల్లో పశ్చిమ, మధ్య, దక్షిణ ద్వీపకల్పంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. రాబోయే 5 రోజుల్లో ఈశాన్య భారతదేశంలో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
గుజరాత్లో మోస్తరు వర్షపాతంతో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు గంటకు 40-50 కి.మీ నుండి 60 కి.మీ వేగంతో వర్షాలు పడనున్నాయి. మే 13, 14 తేదీలలో కొంకణ్, గోవా, మే 14 నుంచి 16 వరకు మధ్య మహారాష్ట్ర, మరాఠావాడ, మే 13న మధ్య మహారాష్ట్ర, మరాఠావాడలో గంటకు 50-60 కి.మీ నుంచి 70 కి.మీ వేగంతో ఉరుములతో కూడిన గాలులు వీచే అవకాశం ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.