మహారాష్ట్రలోని నాగ్పూర్లో మార్చి 17న రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఆ హింసాత్మక ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి సంబంధించి పలువురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నాగ్పూర్ అల్లర్ల సూత్రధారి ఫయీంఖాన్ను కూడా కొద్దిరోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అల్లర్లలో ప్రమేయం ఉన్న మరో 100 మందిని గుర్తించారు. ఔరంగజేబ్ వివాదంలో ఆందోళనకారులను ఫయీంఖాన్ రెచ్చగొట్టడంతోనే అల్లర్లు చెలరేగినట్టు తేల్చారు. అదే సమయంలో.. నాగ్పూర్ హింస వెనుక బంగ్లాదేశ్ హస్తంపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాంతో.. అల్లర్ల వ్యవహారంలో బంగ్లాదేశీయుల హస్తం ఉందా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉందన్నారు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. ప్రస్తుతం దీనిపై ఏమీ చెప్పలేమని.. దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.
హింసకు కారణమైన వారినుంచే ఆస్తి నష్టం వసూలు
నాగ్పూర్ హింసకు కారణాలపై మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ సమక్షంలో పోలీసు ఉన్నతాధికారులతో సీఎం ఫడ్నవీస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. నాగ్పూర్ హింస వెనుక ఉన్నది ఎవరైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సీఎం ఫడ్నవీస్. అంతేకాదు.. హింసకు కారణమైన వారి నుంచే ఆస్తి నష్టం మొత్తాన్ని వసూలు చేస్తామని.. చెల్లించని పక్షంలో వారి ఆస్తులను స్వాధీనం చేసుకుని విక్రయిస్తామన్నారు.
మతపరమైన వస్తువులు దహనం చేసినట్లు కొంతమంది సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేయడంతోనే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. దీనికి కారణమైన 104 మందిపై పోలీసులు చర్యలు తీసుకున్నారని. సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేసి.. అల్లర్లకు కారణమైన వారిని కూడా నిందితులుగా పరిగణిస్తామని సీఎం ఫడ్నవీస్ స్పష్టం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..