హైదరాబాద్ , పంజాగుంటలో ఏడో నిజాం కాలంలో నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ను ఏర్పాటుచేశారు. అనంతర కాలంలో ఇది రాష్ట్రస్థాయి యూనివర్సిటీగా మారింది. నిమ్స్ ఆసుపత్రికి నిత్యం వేల మంది ఓపీ సేవలకోసం వస్తుంటారు. అక్కడ భారీ క్యూలు ఉండటంతో నరకం చవిచూస్తున్నారు. రోజుకు 2500 నుంచి 3000 మంది వరకు వస్తూండటంతో ఓపీ కార్డుల కోసం నిరీక్షణ తప్పట్లేదు. గంటల తరబడి క్యూలో ఉన్నా ఒక్కోసారి ఓపీ కార్డు లభించడం లేదు. కొంతమంది ముందు రోజు వచ్చి ఉదయమే ఓపీ కోసం క్యూలో నిలబడి స్లిప్పు తీసుకొని వైద్యులను సంప్రదిస్తున్నారు.
ఓపీ సేవలకోసం దూరప్రాంతాలనుంచి వచ్చే రోగులకు ఇక్కట్లు తప్పటంలేదు. ఈ పరిస్థితికి చెక్ పెట్టడానికి సమాయత్తమయ్యారు నిమ్స్ నిర్వాహకులు. ఓపీ సేవలను మరింత సులువు చేసేందుకు నిమ్స్లో కియోస్క్ మెషిన్ను అందుబాటులోకి తేనున్నారు. ప్రయోగాత్మకంగా వీటి పరిశీలన ఇప్పటికే ప్రారంభమైంది.
మిలీనియం బ్లాక్ వద్ద కొత్త మెషిన్ను అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ తరహా కొత్త సాంకేతికత వాడటం ఇదే తొలిసారి. ప్రస్తుతం నిమ్స్ ఆస్పత్రిలో పాత భవనంతో పాటు సూపర్ స్పెషాలిటీ బ్లాకుల వద్ద ఓపీ సేవలు అందుబాటులో ఉన్నాయి. సాధరణంగా డాక్టర్ను కలవాలంటే కౌంటర్ వద్దకు వెళ్లి స్లిప్ తీసుకొని మళ్లీ వైద్యుని కోసం వేచి చూడాల్సి ఉంటుంది. డాక్టర్ను కలిసిన అనంతరం పరీక్షల చేయించుకోవడానికి సాయంత్రమైపోతోంది. రిపోర్ట్స్ డాక్టర్కు చూపెట్టాలంటే రెండో రోజు కూడా రావాల్సి వస్తోంది. రెండోరోజు డాక్టర్లను కలవడానికి మళ్లీ లైన్లో నిలబడాల్సి వస్తోంది. కియోస్క్ మెషిన్ల ఏర్పాటుతో రోగుల ఇబ్బందులు తీరుతాయని సిబ్బంది అంటున్నారు.
ఇవి కూడా చదవండి
ఓపీ పేషెంట్లకు సౌలభ్యాలను పెంచేందుకు ఈ కియోస్క్ మెషిన్లను అందుబాటులోకి తెచ్చారు. తొలుత రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు రీ విజిట్కు మాత్రమే ఇవి ఉపయోగపడనున్నాయి. త్వరలో ఓపీ రిజిస్టరేషన్కు సైతం వీటిని అందుబాటులోకి తెస్తామంటున్నారు. ఇదే జరిగితే నిమ్స్ ఆస్పత్రిలో ఔట్ పేషెంట్స్ సేవలు మరింత సులభతరం కానున్నాయి.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..