ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజనుల పట్ల తన అభిమానాన్ని, అనురాగాన్ని మరోసారి చాటుకున్నారు. ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలో పలు గిరిజన గ్రామాల్లో సందర్శించి వారితో మమేకమయ్యారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. గిరిజనుల కష్టాలు తెలుసుకొని చలించిపోయారు. తమ గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం లేదని తెలుసుకున్న పవన్ కల్యాణ్ వెంటనే ఆయా గ్రామాలకు పంచాయితీరాజ్ మంత్రి హోదాలో రోడ్డు నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. పలు గ్రామాలకు యుద్ధ ప్రాతిపదికన రోడ్ల నిర్మాణం పూర్తిచేశారు. పవన్ తమ పట్ల చూపిన ప్రేమకు ఫిదా అయ్యారు.
ఈ క్రమంలోనే బుధవారం పంచాయతీ రాజ్ శాఖకు చెందిన పలువురు అధికారులు అకస్మాత్తుగా తమ గ్రామాలకు వచ్చారు. ఆ అధికారులు ఎందుకు వచ్చారో అక్కడ ఉన్న వారికి ఎవరికి అర్థం కాలేదు. గిరిజనులు ఆ అధికారులను అమాయకంగా చూస్తూ ఉండిపోయారు. ఇంతలో తమను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంపించారని, మీకు దుప్పట్లు, రగ్గులు ఇవ్వమని చెప్పారని ఆ అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే వాహనాల్లో నుండి పెద్ద పెద్ద బాక్సులు బయటకు తీసి వాటిలో ఉన్న దుప్పట్లు, రగ్గులను స్థానిక గిరిజన మహిళలకు పంచారు. ఇలా మక్కువ మండలంలో మొత్తం ఆరు గిరిజన గ్రామాల్లో దుప్పట్లను పంచారు. వర్షాకాలం సీజన్ జరుగుతుండగా, రాబోయే శీతాకాలం సమయంలో గిరిజన కుటుంబాలు చలి నుండి రక్షించుకోవాలని ఉద్దేశ్యంతో ఈ సహాయం అందించినట్లు తెలిపారు. ఈ పంపిణీని బాగుజోల, చిలక మెండంగి, బెండమెడంగి, తాడిపుట్టి, దోయ్ వర, సిరివర గ్రామాల్లో మొత్తం 222 కుటుంబాలకు ఒక్కో ఇంటికి మూడు రగ్గులు చొప్పున పంపిణీ చేశారు.
ఈ సహాయం అందుకున్న గిరిజనులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధతో తమను గుర్తుంచుకొని సహాయం అందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. వర్షాకాలం, చలికాలం సమయంలో రగ్గులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వారు పేర్కొన్నారు. గిరిజన గ్రామాల పట్ల పవన్ కళ్యాణ్ చూపుతున్న శ్రద్ధ, సానుభూతి ప్రజల్లో విశేష స్పందన తెచ్చింది. ఇటీవల సందర్శనలో గిరిజనుల కష్టాలు అర్థం చేసుకున్న ఆయన, అవసరమైన సహాయం అందించడంలో ముందంజ వేస్తున్నారు. ఈ చర్యలతో పవన్ కళ్యాణ్ గిరిజనుల హృదయాలను గెలుచుకుంటూ, మానవతా విలువలను పెంపొందిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.