PM Modi: అదో చీకటి అధ్యాయం.. కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని తాకట్టు పెట్టింది: ఎమర్జెన్సీపై ప్రధాని మోదీ

PM Modi: అదో చీకటి అధ్యాయం.. కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని తాకట్టు పెట్టింది: ఎమర్జెన్సీపై ప్రధాని మోదీ


భారత దేశ చరిత్రలోనే చీకటి అధ్యాయంగా మిగిలిపోయిన ఎమర్జెన్సీ విధించి నేటితో 50 ఏళ్లు పూర్తయ్యాయి.. బీజేపీ దేశవ్యాప్తంగా సంవిధాన్ హత్యా దివస్ అభియాన్‌ను నిర్వహిస్తోంది. మరోవైపు దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులపై దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్‌ వేదికగా స్పందించారు. భారత చరిత్రలో ఎమర్జెన్సీ చీకటి అధ్యాయమన్నారు. ఈరోజును సంవిధాన్‌ హత్య దివస్‌గా భారత ప్రజలు జరుపుకుంటున్నారని మోదీ చెప్పారు. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని అరెస్ట్‌ చేసిందని ఆరోపించారు. అత్యవసర పరిస్థితిని ఏ భారతీయుడు మరచిపోలేరని.. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడినవారికి మా సెల్యూట్ అంటూ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించేందుకు.. రాజ్యాంగంలోని సూత్రాలను బలోపేతం చేస్తామన్నారు మోదీ.. వికసిత్‌ భారత్‌ సాధించేందుకు కృషి చేస్తున్నామన్న ప్రధాని.. పేదలు, అణగారిన వర్గాల కలలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు..

కాంగ్రెస్ పార్టీ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని తాకట్టు పెట్టిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. భారతదేశంలో జూన్ 25, 1975న అత్యవసర పరిస్థితి విధించారు.. అయితే.. భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయాలలో ఒకటైన అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించి యాభై సంవత్సరాలు గడిచిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని తాకట్టు పెట్టిన సమయం అది అంటూ పేర్కొన్నారు. మన రాజ్యాంగం స్వరాన్ని ఎలా అణచివేశారో ఏ భారతీయుడు మర్చిపోలేడు.. పార్లమెంటు స్వరాన్ని అణచివేసి, కోర్టులను నియంత్రించడానికి ప్రయత్నాలు జరిగాయి. 42వ సవరణ వారి చర్యలకు ఒక ప్రధాన ఉదాహరణ. పేదలు, అణగారిన వర్గాలు, దళితులను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నారని ఆయన అన్నారు. అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరాటంలో దృఢంగా నిలిచిన వారందరికీ మేము వందనం చేస్తున్నామని ప్రధానమంత్రి అన్నారు. భారతదేశ ప్రజాస్వామ్య నిర్మాణాన్ని రక్షించడం కోసం మన స్వాతంత్ర్య సమరయోధులు తమ జీవితాలను అంకితం చేశారని తెలిపారు.

సమిష్టి పోరాటం ఫలితంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి, కొత్తగా ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది, కానీ వారు ఆ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారని గుర్తుచేశారు. “మన రాజ్యాంగంలో పొందుపరచబడిన సూత్రాలను బలోపేతం చేయడానికి – అభివృద్ధి చెందిన భారతదేశం అనే మన కలను సాకారం చేసుకోవడానికి మనం కలిసి పనిచేస్తున్నాము. మనం పురోగతిలో కొత్త శిఖరాలను అధిరోహిస్తాము.. పేదలు.. అణగారిన వర్గాల కలలను నెరవేర్చుతాము” అని ప్రధానమంత్రి రాశారు..

నేను అప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌ని:

మోడీ అత్యవసర పరిస్థితి రోజులను గుర్తుచేసుకున్నారు. అత్యవసర పరిస్థితి విధించినప్పుడు, నేను ఆర్‌ఎస్‌ఎస్ యువ ప్రచారక్‌ని అని అన్నారు. అత్యవసర పరిస్థితి వ్యతిరేక ఉద్యమం నాకు ఒక అభ్యాస అనుభవం. ఇది మన ప్రజాస్వామ్య నిర్మాణాన్ని రక్షించుకోవడం – ప్రాముఖ్యతను పునరుద్ఘాటించింది. అలాగే, రాజకీయ వర్గాల ప్రజల నుండి నేను చాలా నేర్చుకోగలిగాను.. అంటూ పేర్కొన్నారు.

ఆ అనుభవాలలో కొన్నింటిని బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ ఒక పుస్తకం రూపంలో సంకలనం చేయడం తనకు సంతోషంగా ఉందన్నారు. ముందుమాటను స్వయంగా అత్యవసర పరిస్థితి వ్యతిరేక ఉద్యమంలో అనుభవజ్ఞుడైన హెచ్‌డి దేవెగౌడ రాశారు.. అని తెలిపారు.

అత్యవసర పరిస్థితి నాటి చీకటి రోజులను లేదా ఆ సమయంలో వారి కుటుంబాలు ఎదుర్కొన్న అనుభవాలను గుర్తుచేసుకునే ప్రతి ఒక్కరూ వాటిని సోషల్ మీడియాలో పంచుకోవాలని నేను కోరుతున్నాను. ఇది 1975 నుండి 1977 వరకు ఉన్న సమయం గురించి యువతలో అవగాహన పెంచుతుంది.. అంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

నాటి ప్రధాని ఇందిరాగాంధీ 25 జూన్‌ 1975లో దేశంలో ఎమర్జన్సీని విధించిన తర్వాత, అప్పట్లో దేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలు, అరచకాల గురించి బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ ఎమర్జెన్సీ డైరీస్ పుస్తకంలో పొందుపరిచింది. ఈ బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ ఎమర్జెన్సీ డైరీస్ పుస్తకాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సాయంత్రం ఆవిష్కరించనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *