PM Modi: 1996 ప్రపంచ కప్ హీరోలతో ప్రధాని మోదీ ప్రత్యేక భేటీ.. ముగ్ధులైన శ్రీలంక క్రికెట్ దిగ్గజాలు

PM Modi: 1996 ప్రపంచ కప్ హీరోలతో ప్రధాని మోదీ ప్రత్యేక భేటీ.. ముగ్ధులైన శ్రీలంక క్రికెట్ దిగ్గజాలు


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీలంక పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా శ్రీలంక ప్రభుత్వం భారత ప్రధానికి అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఇది 140 కోట్ల భారతీయులకు దక్కిన గౌరవమన్నారు మోదీ. రెండు దేశాల మధ్య మొత్తం ఏడు కీలక ఒప్పందాలు కుదరగా.. శ్రీలంక అధ్యక్షుడు దిస్సనాయకేతో ప్రధాని మోదీ కీలక అంశాలను ప్రస్తావించారు. అయితే.. శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిస్సనాయకేతో ద్వైపాక్షిక చర్చలు అనంతరం  భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం సాయంత్రం 1996లో ప్రపంచ కప్ గెలిచిన శ్రీలంక సీనియర్ క్రికెటర్లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కాగా.. ప్రధానమంత్రి మోదీ శ్రీలంక పర్యటన కోసం నిన్న సాయంత్రం బ్యాంకాక్ నుండి కొలంబో చేరుకున్నారు.

1996లో ప్రపంచ కప్ గెలిచిన శ్రీలంక సీనియర్ క్రికెటర్లు సనత్ జయసూర్య, చమిందా వాస్, అరవింద డి. సిల్వా మార్వాన్ ఆటపట్టు, ఇతర శ్రీలంక క్రికెటర్లతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సంభాషించారు.. శ్రీలంక క్రికెట్ స్టార్లతో కలిసి దిగిన ఫోటోలను ప్రధాని మోదీ ట్విట్టర్‌లో షేర్ చేశారు. “1996 ప్రపంచ కప్ గెలిచిన శ్రీలంక క్రికెట్ జట్టు సభ్యులతో సంభాషించడం చాలా ఆనందంగా ఉంది. ఈ జట్టు లెక్కలేనంత అభిమానులను సొంతం చేసుకుంది!” అంటూ మోదీ పోస్ట్ చేశారు.

మార్చి 17న లాహోర్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అర్జున రణతుంగ నేతృత్వంలోని జట్టు ఆస్ట్రేలియాను 22 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో ఓడించగలిగింది. అరవింద డి సిల్వా అజేయంగా 107 పరుగులు, అసంక గురుసిన్హా 99 బంతుల్లో 65 పరుగులు, అర్జున రణతుంగ 37 బంతుల్లో 47 పరుగులు చేయడం వల్ల శ్రీలంక తమ తొలి, ఏకైక ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకోగలిగింది.

“ఇది మంచి సంభాషణ. మేము చాలా విషయాలు చర్చించాము.. క్రికెట్ గురించి మాట్లాడాము. మోదీ ఎలా అధికారం చేపట్టారు.. ఆయన దేశాన్ని ఎలా అభివృద్ధి చేసారో ఆసక్తికర విషయాలను మాట్లాడటం మాకు మంచి అనుభవం. ప్రధానమంత్రి మోడీ భారతదేశానికి ఏమి చేశారో ఆయన స్వయంగా వివరించారు” అని శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య అన్నారు.

“ప్రధాని నరేంద్ర మోదీని వ్యక్తిగతంగా కలవడం మాకు చాలా గౌరవంగా ఉంది. మేము క్రీడల గురించి, 1996లో మేము (శ్రీలంక ప్రజలు) ప్రపంచ కప్‌ను ఎలా గెలుచుకున్నామో మాట్లాడుకున్నాము. ప్రధాన మంత్రి మోడీ దక్షిణాసియాలో అత్యంత శక్తివంతమైన నాయకుడు, ఆయన క్రికెట్ పరిజ్ఞానం చాలా బాగుంది” అని శ్రీలంక మాజీ క్రికెటర్ చమిందా వాస్ అన్నారు.

“భారతదేశంలో ప్రధానమంత్రి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయన చాలా మార్పు తెచ్చారు. శ్రీలంకకు కూడా ఆయన చాలా మంచి పనులు చేశారు. సంక్షోభ సమయాల్లో భారతదేశం ఎల్లప్పుడూ మాకు అండగా నిలిచింది” అని శ్రీలంక క్రికెటర్ కె. రోమేష్ కలువితరాన అన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *