ఉత్తరప్రదేశ్లోని మహోబాలో ఒక విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ PUBG మొబైల్ గేమ్కు ఎంతగా బానిసైందంటే ఆమె తన భర్త, బిడ్డ ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. ప్రేమ కోసం ఆమె తన ఇంటిని, కుటుంబాన్ని కూడా విడిచిపెట్టింది. ఈ సంఘటన సిటీ కొత్వాలి ప్రాంతంలోని భాటిపురా ప్రాంతంలో చోటు చేసుకుంది. 30 ఏళ్ల షీలు రైక్వార్ తన కుటుంబంతో ఇక్కడ నివసిస్తున్నాడు. అతను వృత్తిరీత్యా మిఠాయి తయారీదారు. అతనికి సొంతంగా మిఠాయి దుకాణం ఉంది. షీలు 2022లో బండా జిల్లాలోని మాతాంధ్ నివాసి ఆరాధనను వివాహం చేసుకున్నాడు. మొదట్లో అంతా బాగానే ఉంది, కానీ వివాహం తర్వాత కొంతకాలానికి ఆరాధన PUBG గేమ్కు బానిసైంది.
భర్త రోజంతా దుకాణంలోనే ఉండేవాడు, భార్య ఇంట్లో మొబైల్లో గేమ్స్ ఆడేది. ఈ సమయంలో ఆరాధనకు లూథియానా (పంజాబ్) కు చెందిన శివం అనే యువకుడితో స్నేహం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత మెల్లగా భర్తకు దూరం కావడం ప్రారంభించింది. ఇంట్లో గొడవలు కూడా పెరిగాయి. భర్తపై గృహ హింస ఆరోపణలు చేయడానికి కూడా ప్రయత్నించింది. భర్తను 55 ముక్కలుగా నరికి డ్రమ్లో కుక్కుతానని బెదిరించింది. తన ప్రేమకు భర్త అడ్డుగా మారితే అతన్ని చంపేస్తానని చెప్పింది. ఈ క్రమంలోనే ఆరాధన ప్రియుడు శివం అకస్మాత్తుగా 900 కి.మీ దూరంలో ఉన్న లూథియానా నుండి మహోబాకు చేరుకున్నాడు.
ఇంట్లో గొడవలు, తన భార్య బెదిరింపులు, ఆమె ప్రేమ వ్యవహారంపై షీలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు శివంపై కేసు నమోదు చేశారు. కానీ ఆరాధన తన భర్తను, అమాయక కొడుకును వదిలి తన ప్రేమికుడితో వెళ్లాలని నిర్ణయించుకుంది. అటువంటి పరిస్థితిలో షీలు తన ప్రాణాలు, తన కొడుకు ప్రాణాలను కాపాడటానికి.. ఆరాధనను ఆమె ప్రేమికుడితో వెళ్లనిచ్చాడు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి