Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాలకు వర్ష సూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాలకు వర్ష సూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..


ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓ వైపు ఎండలు, మరోవైపు వానలతో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. ఉదయం వేళ ఎండలు దంచికొడుతుండగా.. సాయంత్రం వేళ ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ వర్ష సూచన చేసింది. ద్రోణి ప్రభావంతో ఆదివారం, సోమవారం పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని.. తెలంగాణలోని పలు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

తెలంగాణలో ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాలతో పాటు సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాగా.. పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీల వరకు నమోదవుతాయని పేర్కొంది.. శనివారం ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది.

ఆంధ్రప్రదేశ్ లోనూ పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాల్లో పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని చెప్పింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

అలాగే.. ఆదివారం విజయనగరం-10, పార్వతీపురం మన్యం-2 మండలాల్లో తీవ్ర వడగాలులు (12), అలాగే 19 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *