రాష్ట్రంలో చెదురుమదురుగా భారీ వర్షాలతో పాటుగా, కొన్నిచోట్ల 50-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ సూచించారు. బుధవారం(28-05-2025) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
గురువారం(29-05-2025) పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మంగళవారం సాయంత్రం 5గంటల నాటికి అనకాపల్లి జిల్లా పాములవాకలో 46.5మిమీ, నరసింగపల్లిలో 41.2మిమీ, యలమంచిలిలో 40.7మిమీ, అల్లూరి జిల్లా అనంతగిరి 37.5మిమీ, అనకాపల్లిలో 29మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు.
తెలంగాణ వర్షాలు..
నైరుతి రుతుపవనాల రాకతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రేపు, ఎల్లుండి తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో రేపు ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వర్షం దంచికొట్టింది. రేపు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జనగాం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు .. ఎల్లుండి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. చాలా ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణశాఖ.