SLBC టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్.. దాదాపు చివరి అంకానికి చేరింది. ప్రమాదస్థలికి కొద్ది మీటర్ల దూరంలో ఉన్నాయి సహాయక బృందాలు. ఆ కొద్ది మీటర్లు దాటితే.. 8మంది కార్మికుల జాడ తెలిసే అవకాశం ఉంది. ఈ గ్యాప్ దాటి ముందుకెళ్లడం రెస్క్యూ టీమ్స్కి ఛాలెంజింగ్గా మారింది. టన్నెల్లో 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం జరిగింది. 12వ కిలోమీటర్ వరకు లోకో ట్రైన్లో రెస్క్యూ బృందాలు వెళ్తున్నాయి. ట్రాక్ అక్కడి వరకే ఉండటంతో ఆ తర్వాత కాలినడకన ముందుకెళ్తున్నాయి. ప్రస్తుతం స్పాట్కి సమీపంలో టన్నెల్ బోరింగ్ మెషిన్ శకలాలు, బురద మేటతో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. శకలాలతో పాటు బురదను తొలగించాలంటే.. రెస్క్యూ బృందాల ముందున్న ఏకైక మార్గం కన్వెయర్ బెల్ట్. ఈ బెల్ట్ సాయంతోనే బురద, శకలాల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేయాలని భావిస్తున్నారు. ఇది ఎంత స్పీడ్గా చేస్తే.. ఆపరేషన్కి అంత త్వరగా ఎండ్ కార్డ్ పడే అవకాశం ఉంది.
రెస్క్యూ బృందాలు వెళ్లలేని ప్రదేశానికి ర్యాట్ టీమ్
సహాయక చర్యల్లో వేగం పెరగడం వెనుక ఫిరోజ్ ఖురేషీ పాత్ర కీలకంగా కనిపిస్తోంది. ఉత్తరాఖండ్కి చెందిన 14మంది ర్యాట్ మైనర్ టీమ్కి ఫిరోజ్ నాయకత్వం వహిస్తున్నాడు. వచ్చిరాగానే టన్నెల్లోకి వెళ్లాడు. భుజాలకి తాళ్లు కట్టుకుని.. చివరి పాయింట్ వరకు తన టీమ్ను తీసుకెళ్లాడు. ఇప్పటిదాకా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ కూడా వెళ్లలేని ప్రదేశానికి చాకచాక్యంగా వెళ్లాడు ఫిరోజ్. టీబీఎస్ మెషిన్ చుట్టుపక్కల ఉన్న శకలాలను పలుగు, పారతో తొలగించి.. బురద నీటిని పక్కకు పోయేలా చేశారు. దీంతో రెస్క్యూ ఆపరేషన్ కాస్త సులువుగా మారింది. ల్యాండ్ స్లైడ్ కారణంగా టీబీఎస్ మెషిన్ పూర్తిగా ధ్వంసమైనట్టు గుర్తించారు. ఈ మెషిన్ పరిసరాల్లోనే కార్మికులు ఉంటారని అనుమానిస్తున్నారు.
ఆపరేషన్ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న మంత్రి ఉత్తమ్.. రెస్క్యూ చివరి దశకు చేరిందన్నారు. గల్లంతయిన వారిని క్షేమంగా తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు.
ర్యాట్ మైనర్స్ టీమ్ టన్నెల్లోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యిందో… అప్పటినుంచి రెస్క్యూ ఆపరేషన్ స్పీడ్ అందుకుంది. అడ్డంకుల్ని అధిగమిస్తూ ఫిరోజ్ ఖురేషి టీమ్ స్పాట్కి ఎంత త్వరగా వెళ్తుంది.. కార్మికుల ఆచూకీ ఎప్పుడు గుర్తిస్తుందన్నది ఉత్కంఠగా మారింది.
వేడెక్కిన రాజకీయం..
ఇదిలాఉంటే.. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై జ్యూడీషియల్ కమిషన్ ఏర్పాటుకి డిమాండ్ చేసిన బీఆర్ఎస్.. ఇవాళ దోమలపెంటకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. కొట్లాది రూపాయల ప్రజాధనంతో చేపడుతున్న ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోవడం కాంగ్రెస్ అసమర్థతకు నిదర్శనం అని మండిపడుతోంది. పోలీసులు తమ పర్యటనకు ఎలాంటి ఆటంకాలు కలిగించొద్దన్నారు మాజీ మంత్రి హరీష్రావు. అయితే బీఆర్ఎస్ నిర్ణయంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. ప్రకృతి విపత్తును కూడా రాజకీయం చేసి లబ్ది పొందాలనుకోవడం సరికాదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..
బీఆర్ఎస్ నేతలు ఎస్ఎల్బీసీకి దగ్గరకు వెళ్లడమంటే.. చేస్తున్న పనిని డిస్టర్బ్ చేయడమేనంటోంది కాంగ్రెస్. రెచ్చగొట్టే ప్రసంగాలతో ప్రశాంత వాతావరణం పాడుచేయొద్దంటోంది. బీఆర్ఎస్ దోమల పెంట పర్యటనకు పోలీసులు పర్మిషన్ ఇస్తారా? ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్ట్ చేస్తారా? అదే జరిగితే గులాబీ నేతల యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుందన్నది చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..