
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడానికి అతడి ఒత్తిడే కారణమా.? అవునని అందరూ ఆన్సర్ ఇస్తున్నారు. టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ ఒత్తిడి కారణంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇచ్చినట్టు సమాచారం. డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్కు జట్టులో కొత్త ముఖాలు ఉండాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సెలక్షన్ కమిటీకి చెప్పినట్టు తెలుస్తోంది. ఈ కారణంగా ఇంగ్లాండ్తో జరిగే టెస్ట్ సిరీస్ నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను తప్పించాలని సెలక్షన్ కమిటీ పరిశీలించినట్టు పీటీఐ నివేదించింది.
గౌతమ్ గంభీర్ కోచ్ అయినప్పటి నుంచి టెస్ట్ క్రికెట్లో టీమ్ ఇండియా అత్యంత చెత్త ప్రదర్శనను చేసింది. ముఖ్యంగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుల్లో భారత జట్టు ఘోర పరాజయాలను చవిచూసింది. ఈ పరాజయాలకు సమాధానం వెతుకుతూ గంభీర్.. జట్టులోని సీనియర్ ఆటగాళ్లపై వేటు వేసి.. కొత్త జట్టును నిర్మించాలని చూస్తున్నాడట. ముఖ్యంగా 2027 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ ఇంగ్లాండ్తో జరిగే సిరీస్తో ప్రారంభమవుతున్నందున.. ఈ సిరీస్ కోసం కొత్త ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని గంభీర్ ఆలోచించాడు. అదే సెలక్టర్ల ముందు ఉంచాడు. అంతేకాకుండా భారత జట్టులో స్టార్ సంస్కృతిని అంతం చేయడమే తన మొదటి లక్ష్యమని గంభీర్ స్పష్టం చేశాడట. సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్ కూడా గంభీర్ ఆలోచనకు ఏకీభవించడంతో.. తొలి అడుగుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఇంగ్లాండ్తో జరిగే సిరీస్కు ఎంపిక చేయబోమని సమాచారం అందించారు. దీంతో ఆ ఇద్దరు సెలక్టర్లు జట్టును ప్రకటించకముందే.. రిటైర్మెంట్ ఇచ్చేశారు.
గౌతమ్ గంభీర్ శకం స్టార్ట్ అయిపోయింది. తదుపరి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో భారత జట్టులో కొత్త ముఖాలు కనిపించనున్నాయి. అందుకే సీనియర్ ఆటగాళ్లను జట్టు నుంచి విడుదల చేయాలని నిర్ణయించినట్లు బీసీసీఐ అధికారి ఒకరు పీటీఐకి తెలిపారు. ఇక నుంచి టీం ఇండియాలో గంభీర్ నిర్ణయాలే ఫైనల్ అవుతాయి. ఈ నిర్ణయాలతో ఇంగ్లాండ్లో టీమిండియా ఎలా రాణిస్తుందో చూడాలి..?