టైటిల్ చూసి తిట్టేశాం అని అనుకోవద్దు. క్రికెట్ పిచ్చోళ్లు, రన్ మెషిన్లు అని అర్ధం మావ.. అదే ఆ ప్లేయర్స్ ఇద్దరూ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ పర్యటనకు ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన సంగతి తెలిసిందే. దీంతో యువ ఆటగాళ్ల నిండిన టీమిండియా ఇంగ్లాండ్ గడ్డపై ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ ఇద్దరు ఆటగాళ్లు 2027లో జరగనున్న వన్డే ప్రపంచ కప్పై దృష్టి సారించినప్పటికీ, భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ 2027 వన్డే ప్రపంచకప్ కూడా ఆడకపోవచ్చునని అన్నారు.
‘2027 వన్డే ప్రపంచకప్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జట్టులో ఉండరని భావిస్తున్నట్టుగా గవాస్కర్ చెప్పుకొచ్చాడు. వన్డే ఫార్మాట్లో రోహిత్, కోహ్లీ విధ్వంసకర ప్లేయర్స్ అయినప్పటికీ.. వన్డే ప్రపంచకప్ ఆడటానికి వరి వయస్సు సహకరించడని గవాస్కర్ పేర్కొన్నాడు. 2027 నాటికి రోహిత్ శర్మకు 40 ఏళ్లు.. విరాట్ కోహ్లీకి 38 ఏళ్లు వస్తాయి. అటువంటి పరిస్థితిలో వారిద్దరూ వన్డే క్రికెట్లో ఆడటం కష్టంగా అనిపిస్తుంది. రోహిత్, విరాట్ వన్డేల్లో అద్భుతంగా రాణిస్తున్నారని.. అయితే వారిద్దరి ప్రపంచకప్ భవిష్యత్తును మాత్రం సెలక్టర్లు నిర్ణయిస్తారని సునీల్ గవాస్కర్ చెప్పాడు. జట్టులో ఉంటూ వారిద్దరూ ఏదైనా చేయగలరని సెలక్టర్లు భావిస్తేనే వారిని ఎంపిక చేస్తారని లిటిల్ మాస్టర్ అన్నాడు.
రోహిత్-విరాట్ 2027 వన్డే ప్రపంచకప్లో..
టెస్ట్, టీ20 ఫార్మాట్ల నుంచి రిటైర్ అయిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్పై మాత్రమే దృష్టి పెట్టాలనుకుంటున్నారు. 2027లో జరగనున్న వన్డే ప్రపంచకప్ గెలవాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఈ విషయాన్ని వారిద్దరూ కూడా పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు.