ఈ ప్రభుత్వ పాఠశాల సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్లో ఉంది. ఇది మామూలు పాఠశాల కాదు..ఇందులో అడ్మిషన్ కోసం సీఎంవో ఆఫీస్ నుండి కూడా సిఫార్సులు వస్తున్నాయి. పాఠశాలలకు సెలవులు ముగిసాయి. తల్లిదండ్రులు ఎంత కష్టం వచ్చినా సరే ఫీజులకు వెనకాడకుండా ప్రైవేట్ స్కూళ్లలో అందరూ చేర్పిస్తున్నారు.. మారుతున్న కాలానుకూలంగా తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని, లక్షల్లో ఫీజు కట్టు మరీ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయిస్తున్నారు. మధ్యతరగతి వాళ్లు సైతం ప్రైవేట్ స్కూళ్ల వైపే మొగ్గు చూపుతున్నారు. పిల్లలందరూ ప్రైవేట్ స్కూళ్లకు వెళ్తుండటంతో ప్రభుత్వ పాఠశాలకు ఆదరణ తగ్గిందనే చెప్పాలి. ప్రతి గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలకు పిల్లల్ని పంపాలని విజ్ఞప్తి చేసినా, తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ పాఠశాలలో వందకు మించి విద్యార్థులు ఎక్కడా ఉండడం లేదు. కానీ సిద్దిపేట ఇందిరానగర్ స్కూల్లో మాత్రం తల్లిదండ్రులు పోటీపడి మరి ఆ స్కూల్లో పిల్లలను చేర్పిస్తున్నారు.
ఆ స్కూల్ డిమాండ్ ఎలా ఉందంటే.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక కౌన్సిలర్లు సైతం తమవారికి సీటు కావాల్సిందే అంటూ ప్రిన్సిపాల్తో గొడవలు పడుతున్నారట. కొన్నిసార్లు సీఎంఓ నుంచి కూడా రికమండేషన్స్ వస్తాయట. పదేళ్ల క్రితం 300 మంది విద్యార్థులకు పరిమితమైన సిద్దిపేట పట్టణంలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో నేడు 1200 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు క్లాసులు నిర్వహిస్తారు.. ఉన్న ఈ ఐదు తరగతులకు 23 సెక్షన్లు ఉన్నాయి. ఓ రకంగా చెప్పాలి అంటే కార్పొరేట్ పాఠశాలలకు మించి డిమాండ్ ఉన్న పాఠశాల ఇది. ఇందులో కంప్యూటర్ ల్యాబ్లు, పారెన్ లాంగ్వేజి బోదన, ఆన్లైన్ తరగతులు, ఐఐటీ ఫౌండేషన్ విద్య, విశాలమైన ఆట మైదానం, ఆధునిక సౌకర్యాలతో 24 తరగతి గదులు ఉన్నాయి. ఒక్కో సబ్జెక్టుకు నిష్ణాతులైన నలుగురు ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారు.
మాజీ మంత్రి హరీష్ రావు కృషి
ఈ పాఠశాలకు ఇంతలా గుర్తింపు రావడానికి మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు కృషి ఎంతో ఉంది. హరీష్ రావు ప్రత్యేక చొరవతో పలు కార్పొరేట్ పరిశ్రమల సహకారం తీసుకొని ఇక్కడ తరగతి గదులు కట్టించారు. అదే విధంగా కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయించారు. డిజిటల్ క్లాస్ రూములు సిద్ధం చేశారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు నెలలో రెండుసార్లు ఈ పాఠశాలను ఆకస్మికంగా విజిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. విదేశీ భాషలు, ఐఐటీ ఫౌండేషన్, కోర్సుల కోసం కృషి చేశారు. అంతేగాకుండా డిజిటల్ కంటెంట్ విద్యా విధానాన్ని ఈ పాఠశాల విద్యార్థులకు పరిచయం చేయడానికి సొంత ఖర్చులు పెట్టుకున్నారు. తద్వారా పదో తరగతి ఫలితాల్లో అత్యధిక ర్యాంకులు ఈ పాఠశాలకు రావడానికి దోహదం చేశారు. ప్రధానమంత్రి పథకానికి సైతం ఈ పాఠశాల ఎంపికైంది. సాధారణంగా ఇంజనీరింగ్, మెడికల్, డిగ్రీ, గురుకులాల్లో సీట్ల కోసం ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తులు చేస్తుం టారు. ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు ఈ విధానం ఇంకా పాకలేదు. కానీ ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలలో గత ఏడాది నుంచే ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. పాఠశాలకు సంబంధించి ఒక క్యూఆర్ కోడ్ రూపొందించారు. ఈ కోడ్ను స్కాన్ చేయగానే దరఖాస్తు ఫారం డౌన్ లోడ్ అవుతుంది. ఇందులో విద్యార్థుల వివరాలను నమోదు చేసి ఆన్లైన్లోనే దరఖాస్తు చేయవచ్చు..అదే విధంగా దరఖాస్తు పత్రాలను స్కూల్లో సమర్పించేలా చర్యలు చేపట్టారు.
మానవీయ కోణంలో ఎంపిక
ప్రతీ ఏటా 6వ తరగతి కోసం కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ ఏడాది 180 సీట్లు 6వ తరగతిలో ఖాళీగా ఉన్నాయి. ఇందుకు 600పైగా దరఖాస్తులు వచ్చాయి. మరో 200పైగా దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు. అన్ని దరఖాస్తులను పరిశీలించి ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. దీనికి ముందు అనాథలు, సింగిల్ పేరెంట్ పిల్లలు, పేద విద్యార్థుల వివరాలు సైతం సేకరిస్తారు. మానవతా కోణంలో పరిశీలన చేశాకనే ఈ సీట్లు భర్తీ చేస్తారు. సీట్లు మిగిలితే ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించి.. విద్యార్థులను తీసకుంటారు. ఎలాంటి పైరవీలకు తావివ్వకుండా పారదర్శంగా సీట్లు కేటాయిస్తున్నామని ప్రిన్సిపల్ తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..