క్రీడారంగంలో వరంగల్ జిల్లాకు మహార్దశ పట్టనుంది. జిల్లాలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు సీఎం రేవంత్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతే కాకుండా స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు కూడా పచ్చజెండా ఊపారు. ముఖ్యంత్రిని కలిసిన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, యశస్వినిరెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డిలకు ఈ శుభవార్త చెప్పారు. స్టేడియం నిర్మాణానికి స్థల పరిశీలన చేసి,10 రోజుల్లో జీవో జారీ చేస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా ఉన్న వరంగల్ను రాష్ట్రానికి రెండో రాజధాని చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఉమ్మడి వరంగల్ అభివృద్దిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మామునూరు ఎయిర్పోర్ట్, అండర్గ్రౌండ్ డ్రెయినేజీ తదితర పథకాల కోసం ఇప్పటికే సుమారు రూ.6 వేల కోట్ల నిధులు కేటాయించింది ప్రభుత్వం. తాజాగా ఆదివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో సీఎం రేవంత్రెడ్డిని ఎమ్మెల్యేలు క్రికెట్ స్టేడియం, స్పోర్ట్స్ స్కూల్ కావాలని కోరడంతో గ్రిన్ సిగ్నల్ ఇచ్చారు.
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల సమీపంలోని 50 ఎకరాలు అనువుగా ఉంటుందని సీఎం రేవంత్కు ఎమ్మెల్యేలు వివరించారు. ఉమ్మడి వరంగల్ నుంచి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించిన క్రీడా దిగ్గజాలు ఉన్నారని, అందులో ద్రోణాచార్య, అర్జున అవార్డులు అందుకున్న వారు ఉన్నారని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం హనుమకొండలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఒక్కటే ఉంది. ఇక్కడ అనేక మంది క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారని వివరించారు. వరంగల్లో స్పోర్ట్స్ స్కూల్, క్రికెట్ స్టేడియం నగరానికి మణిహారంగా నిలుస్తాయని సీఎం రేవంత్రెడ్డికి ఎమ్మెల్యేలు తెలిపారు.
ఎమ్మెల్యేల వినతిపై సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్రెడ్డి తెలిపారు. ఈమేరకు స్పోర్ట్స్ స్కూల్, స్టేడియం నిర్మాణాలకు కావాల్సిన ప్రతిపాదనలు పరిశీలించి, అవసరమైన విధివిధానాలను రూపొందించాలని సంబంధిత శాఖ సెక్రటరీకి ఫోన్ చేసి ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కాగా.. త్వరలోనే ఆరెండింటినీ మంజూరు చేస్తానని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇవ్వడంపై ఎమ్మెల్యేలు సంతోషం వ్యక్తం చేశారు.