ఇటీవల భారత్లో సైబర్ నేరాల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. కాలానుగుణంగా మోసగాళ్లు వివిధ మోసాలు చేస్తూ రెచ్చిపోతున్నారు. ప్రస్తుత కాలంలో ఇంటి నుంచి పని చేయడం, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం, తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు ఆర్జించడం లాంటివి భాగా ప్రచారం జరుగుతున్నాయి. ఇలాంటి ప్రకటనలు నమ్మి జనం భారీగా మోసపోతున్నారు. ఈ క్రమంలోనే.. మరో కొత్త రకం ఎత్తుగడతో రెండు లక్షలకు టోకరా వేశారు కేటుగాళ్లు.
హైదరాబాద్లో ఉండే కామారెడ్డి జిల్లా బీర్కూరుకు చెందిన నర్ర గంగారామ్.. సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంతూరుకు వెళ్లారు. అయితే.. పండుగ మూడ్లో ఉన్న గంగారామ్.. ఈ నెల 13న ఇన్స్టాగ్రమ్లో పాత నాణేలు తీసుకుని 99 లక్షలు ఇస్తామనే ప్రకటన చూసి మురిసిపోయారు. ఆ వెంటనే ప్రకటనలోని నంబర్కు ఫోన్ చేసి మాట్లాడారు. పాత కాలం నాటి ఒక్క పైసా.. 5, 10, 20, 50 పైసల నాణేలతో పాటు ఓ ప్రత్యేక నంబర్ ఉన్న 100, 200 రూపాయల నోట్లు ఇస్తే.. 99 లక్షలు పంపుతామని చెప్పారు. అయితే.. అందుకు కొంత ఖర్చు అవుతుందని నమ్మించారు.
అంతే.. ఆ కేటుగాళ్ల మాటలు నమ్మిన గంగారామ్.. ఈ నెల 14 నుంచి 17 వరకు విడతల వారీగా ఒక లక్షా 80వేలు డిజిటల్ యాప్లో చెల్లించారు. ఈ నెల 17న మళ్లీ ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు 99లక్షలు ఇవ్వాలంటే ఎయిర్పోర్ట్కు కారు, రక్షణ సిబ్బందికి ఖర్చు అవుతాయని.. అందుకు మరో లక్ష పంపాలని కోరారు. దాంతో.. షాకైన బాధితుడు గంగారామ్.. మోసపోయినట్లు గుర్తించి లబోదిబోమన్నారు. జరిగిన మోసంపై బీర్కూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.