శేషాచలం అటవీ ప్రాంతంలో చిరుతలు ఇప్పుడు మరోసారి శ్రీవారి భక్తులను భయపెడుతున్నాయి. తరచూ కనిపిస్తూ ఆందోళనకు గురి చేస్తున్నాయి. తిరుమల నడక మార్గాలు, ఘాట్ రోడ్లలో సంచరిస్తున్న చిరుతలు రెండ్రోజులుగా భక్తుల కంట పడుతున్నాయి. ఇందులో భాగంగానే తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో చిరుత హల్చల్ చేసింది. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే ఘాట్ రోడ్డులోని చివరి మలుపు వద్ద చిరుత సంచారాన్ని భక్తులు గమనించారు. వాహనాల్లో వెళ్ళే భక్తులు చిరుత ఘాట్ రోడ్డుకు ఉన్న పిట్ట గోడపై పరుగులు పెడుతూ కనిపించింది. చిరుతను చూసి భయాందోళనకు గురైన భక్తులు సెల్ఫోన్లో చిత్రీకరించారు. నిన్న అలిపిరి నడక మార్గంలోనూ భక్తుల కంటపడింది. ఈ రోజు రాత్రి 8 గంటల సమయంలో ఘాట్ రోడ్డులో చిరుత కనిపించింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది భక్తులను అలెర్ట్ చేసింది. ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనదారులను జాగ్రత్తగా వెళ్లాలని భద్రతా సిబ్బంది సూచించింది.