ఒకటి రెండు కాదు.. 20 ఏళ్లుగా అభిమానులను అలరిస్తూనే ఉన్నారు త్రిష. తెలుగు, తమిళం అని తేడా లేదు అన్ని చోట్లా ఈమెకు ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో రప్ఫాడిస్తున్నారు ఈ బ్యూటీ.
చిరంజీవి విశ్వంభరతో పాటు తమిళంలో అజిత్, విజయ్, సూర్య లాంటి హీరోలతో నటిస్తూ బిజీగా ఉన్నారు త్రిష. సినిమాల్లో ఊపిరి సలపలేనంత బిజీగా ఉన్న త్రిష.. తాజాగా రాజకీయాల గురించి మాట్లాడారు.
నిజానికి ఈమె పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. తాజాగా త్రిష చేసిన కామెంట్స్తో ఇది దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. తనకు తమిళనాడు సిఎం కావాలని ఉందంటూ బాంబు పేల్చారు త్రిష.
తమిళనాట రాజకీయాలు, సినిమాలకు విడదీయరాని అనుబంధం ఉంది. ఈ మధ్యే విజయ్ కూడా రాజకీయాల్లోకి వచ్చారు. కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నపుడే సినిమాలను సైతం ఆయన వదిలేసారు. తాజాగా త్రిష కూడా తనకు సిఎం కావాలని ఉందంటూ చెప్పడంతో.. త్వరలోనే రాజకీయాల్లోకి రావడం ఖాయం అనిపిస్తుంది.
ప్రజాసేవతో పాటు సామాజిక మార్పులు రాజకీయాల వల్లే సాధ్యమంటున్నారు త్రిష. విజయ్ పొలిటికల్గా బిజీ అవుతున్న సమయంలోనే త్రిష నుంచి ఇలాంటి కామెంట్స్ రావడం ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. స్నేహితుడి పార్టీలో చేరతారా లేదంటే మరేదైనా కొత్త పార్టీ వైపు త్రిష ఆలోచనలు సాగుతున్నాయా అనే చర్చ జోరుగా జరుగుతుంది తమిళనాట.