
బెంగళూరు ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 75 కోట్ల విలువైన దాదాపు 38 కిలోల మాదకద్రవ్యాలతో ఇద్దరు నైజీరియన్ మహిళలను అరెస్టు చేశారు పోలీసులు. ఇది కర్నాటకలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద డ్రగ్స్ స్మగ్లింగ్ అని తెలిపారు పోలీసులు. బాంబా ఫాంటా, అబిగైల్ అడోనిస్ అనే ఇద్దరు మహిళలు తమ ట్రాలీ బ్యాగుల్లో డ్రగ్స్ తీసుకొచ్చినట్లు గుర్తించారు. ఢిల్లీ నుండి బెంగళూరుకి వచ్చిన మహిళలను పక్కా సమాచారంతో ఎయిర్ పోర్టులో దిగగానే అరెస్టు చేశారు. వారి నుంచి 37 కేజీల 870గ్రాముల MDMA డ్రగ్స్ సీజ్ చేసినట్లు.. మంగళూరు పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ తెలిపారు. నాలుగు మొబైల్ ఫోన్లు, పాస్పోర్ట్లు, 18వేల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఢిల్లీలో నివసిస్తూ.. దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాలను చేరవేస్తున్నట్లు గుర్తించారు. గతేడాది వీరిద్దరూ.. ముంబైకి 37సార్లు, బెంగళూరుకు 22 సార్లు ప్రయాణం చేశారని ట్రావెల్ హిస్టరీ బయటపెట్టారు.
2020లో నిందితురాలు ఫాంటా బిజినెస్ వీసాపై భారతదేశానికి రాగా.. మరో నిందితురాలు అడోనిస్… 2016 నుండి దేశంలోనే ఉంటున్నారని సీపీ అనుపమ్ తెలిపారు. ఇద్దరు మహిళలు రెండేళ్లుగా డ్రగ్స్ స్మగ్లింగ్ పాల్గొంటున్నట్లు అధికారులు తెలిపారు. ఆరు నెలల క్రితం మంగళూరులో హైదర్ అలీ అనే వ్యక్తిని 15 గ్రాముల డ్రగ్స్ తో పట్టుకున్నప్పుడే ఈ ఆపరేషన్ ప్రారంభమైందన్నారు. ఆ తర్వాత 6 కిలోల డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు. నైజీరియన్ జాతీయుడు పీటర్ ఇచ్చిన సమాచారంతో డ్రగ్స్ రాకెట్ ని ఛేదించినట్లు తెలిపారు మంగళూరు సీపీ. వీరి వెనుక ఎవరున్నారు, ఢిల్లీ కేంద్రంగా డ్రగ్స్ దందా చేస్తున్నదెవరు అనే దానిపై ఫోకస్ పెట్టారు.