తల్లి ప్రేమ ఎంతో విలువైనది.. వెలకట్టలేనిది.. బిడ్డకు ఏదైనా జరిగితే తల్లి మనసు విలవిలలాడి పోతుంది. ప్రేమకు మారు పేరు అమ్మ. అలాంటి తల్లి ప్రేమకు నిదర్శనంలా నిలిచే ఓ ఘటన తాజాగా ఖమ్మంలో చోటు చేసుకుంది. ఓ వైపు ప్రమాదం జరిగిన తనకు రక్తమోడుతున్నా, మరోవైపు బిడ్డకు ఏమైందో అని తల్లడిల్లిపోయిన ఆ తల్లి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. అప్పటి వరకు ప్రయాణం సాఫీగా సాగింది. కొద్ది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాం అని అనుకున్నారు. కానీ అంతలోనే ఒక్కసారిగా భారీ శబ్దం.. కుదుపు.. ఏమి జరిగిందో తెలిసే లోపే.. తాము ప్రయాణిస్తున్న బస్సు పల్టీ కొట్టి రోడ్డు పక్కకు దూసుకుపోయింది. కొందరికి గాయాలు అయ్యాయి. ఆ ప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెకు రక్తమోడుతున్నా చలించలేదా తల్లి.. చేతిలో బిడ్డకేమైందోనని తల్లడిల్లిపోయింది. కన్నా నీకేం కాలేదు కదా? అని గుండెకు హత్తుకుంది. ఆ దృశ్యాలు అక్కడున్న వారి చేత కన్నీళ్లు పెట్టించాయి.
హైదరాబాద్ నుంచి సత్తుపల్లి వెళ్తున్న ఆర్టీసీ రాజధాని బస్సు.. తెల్లవారు జామున ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల సమీపాన పల్టీ కొట్టింది. రహదారిపై నడిచి వెళ్తున్న ఓ వ్యక్తిని తప్పించే క్రమంలో బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో పక్కకు ఒరిగి పల్టీ కొట్టి, చెట్టును ఢీకొని ఆగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఓ ముగ్గురికి మాత్రం తీవ్ర గాయాలు అయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న తల్లాడ మండలం అన్నారుగూడెంకు చెందిన బీరెల్లి రాణికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ పక్క ఆమె రక్తమోడుతున్నా.. తన ఐదేళ్ల కుమారుడికి ఏమైందోనని దగ్గరకు తీసుకుని.. ఒళ్లంతా తడుముతూ గుండెలకు హత్తుకుంది. ఆ క్షణంలో ఆ తల్లి బిడ్డ కోసం పడుతున్న తపన.. అందరినీ కదిలించింది. చిన్నారి ప్రమాదం బారి నుంచి సురక్షితంగా బయటపడటంతో తల్లితోపాటు అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదే కదా స్వచ్ఛమైన, వెలకట్టలేని తల్లి ప్రేమ అంటే.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.