రెండేళ్ల క్రితం ఓ టైలర్ హత్య కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆరుగురికి ఒక్కొక్కరికి ఆరు సంవత్సరాల చొప్పున జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగు చూసింది.
హసన్ జిల్లా చన్నరాయపట్నం తాలూకాలోని ఊపినహళ్లి గ్రామానికి చెందిన గంగాధర్ (42) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు పక్కా ఆధారాలతో నేరాన్ని రుజువు చేస్తూ పక్కా సాక్ష్యాధారాలతో కోర్టులో సమర్పించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. చన్నరాయపట్న తాలూకాలోని జనివారా గ్రామానికి చెందిన భరత్ (34), అభిషేక్ అలియాస్ కబాబ్ అభి (29), చిరంజీవి (27), అభి అలియాస్ రెబెల్ అభి (32), సోమశేఖర్ (33), కుమార్ అలియాస్ థీఫ్ కుమార్ లను దోషులుగా నిర్ధారించారు. దీంతో ఒక్కొక్కరికి ఆరేళ్ల జైలు శిక్ష విధించారు న్యాయమూర్తి.
మృతుడు గంగాధర్ వృత్తిరీత్యా టైలర్గా పని చేస్తున్నాడు. గత 20 సంవత్సరాలుగా, పట్టణంలోని కె.ఆర్. సర్కిల్ సమీపంలో టైలర్ షాపు నిర్వహిస్తున్నాడు. రెండున్నర సంవత్సరాల క్రితం, గంగాధర్ తన మొబైల్ ఫోన్లో ఒక కస్టమర్కు కాల్ చేయడానికి ప్రయత్నించాడు. ఒక మహిళకు బదులుగా తప్పుడు నంబర్కు డయల్ చేశాడు. అయితే, కాల్ మోగిన తర్వాత, రాంగ్ నెంబర్ అని తెలుసుకుని ఫోన్ కట్ చేసి సరైన నంబర్కు కాల్ చేశాడు.
కొంత సమయం తరువాత, గంగాధర్ కు అదే నంబర్ నుండి కాల్ వచ్చింది. తనకు కావాలనే ఫోన్ చేశావంటూ బిగ్గరగా మాట్లాడటం మొదలుపెట్టగానే, ఇద్దరి మధ్య ఫోన్లో వాగ్విదం జరిగి, గంగాధర్ కోపంగా ఆమెను తిట్టి కాల్ కట్ చేశాడు. చివరికి, తనది కాని తప్పుకు అతను ఒక సందేశం ద్వారా క్షమాపణలు కూడా చెప్పాడు.
ఈ సంఘటన గురించి సదరు మహిళ తన భర్త భరత్కు చెప్పింది. దీంతో భరత్ అతని స్నేహితులతో కలిసి ఎం.జి. చన్నరాయపట్నం వెళ్ళారు. గంగాధర్ను కిడ్నాప్ చేసి, శ్రావణబెళగొళ రోడ్డులోని జనివారా గ్రామం సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు తీసుకువచ్చారు. అతనిపై ఇష్టానుసారంగా దాడి చేశారు. దీంతో గంగాధర్ అక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు సంఘటనా స్థలానికి రావడం చూసి నిందితులు పారిపోయారు. తీవ్రంగా గాయపడ్డ గంగాధర్ను స్థానికులు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. చివరికి చికిత్స పొందుతూ గంగాధర్ మరణించాడు.
గంగాధర్ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. తరువాత, బెయిల్పై విడుదలైన నిందితులు, సాక్ష్యాలను నాశనం చేసే ఉద్దేశ్యంతో మృతుడి కుటుంబానికి రూ.37 లక్షలు చెల్లించడానికి అంగీకరించారు. మృతుడి కుటుంబానికి అడ్వాన్స్గా రూ.25 లక్షలు ఇచ్చారు. శిక్ష నుండి తప్పించుకోవడానికి కోర్టులో తప్పుడు సాక్ష్యం కూడా చెప్పారు.
ఈ విషయం న్యాయమూర్తుల దృష్టికి వచ్చి, నిందితులను తీవ్రంగా మందలించారు. ప్రత్యేక కేసుగా పరిగణించిన చన్నరాయపట్నం 4వ JMFC జడ్జి వి.ఎన్., నిందితులు లక్షల రూపాయలతో ధ్వంసం చేశారనే మానవ ఆధారాలకు బదులుగా, పోస్ట్మార్టం నివేదికలు, డాగ్ స్క్వాడ్ పరీక్షలు, వేలిముద్ర నిపుణుల నివేదికలు, ఫోన్ రికార్డులు, హత్యకు ఉపయోగించిన వాహనం వంటి డజన్ల కొద్దీ డిజిటల్ ఆధారాలను దర్యాప్తు అధికారుల నుండి సేకరించారు. డిజిటల్ ఆధారాల ఆధారంగా గంగాధర్ను ఆరుగురు వ్యక్తులు కలిసి చేసిన రుజువైంది. దీంతో నిందితులకు ఒక్కొక్కరికి 6 సంవత్సరాల జైలు శిక్ష విధించారు న్యాయమూర్తి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..