
జోగుళాంబ గద్వాల్ జిల్లా వడ్డేపల్లి మండలం తనగల గ్రామానికి చెందిన సంద్యపోగు కిష్టన్న, తీములమ్మ దంపతులకు నలుగురు సంతానం. ఆస్తి పంపకాల విషయంలో కుటుంబంలో గత కొంతకాలంగా వివాదం నెలకొంది. మూడోవాడైన సంద్యపోగు రమేష్, ఇతర సోదరులకు మధ్య వైరం పెరిగింది. గత సంవత్సరం రమేశ్పై అన్న తిమ్మప్ప, తమ్ముడు మహేశ్. హత్యాయత్నం చేశారు. విఫలం కావడంతో ఘటనపై కేసు నమోదు అయింది.
ఇక ఎలాగైనా రమేష్ను మట్టుబెట్టాలని అతడి తల్లితండ్రులు, ఇద్దరు అన్నదమ్ములు భావించారు. ఇందుకోసం పక్కా స్కెచ్ వేశారు.
మహేష్ తనకు పరిచయం ఉన్న బోయ నర్సింహులుకు విషయం చెప్పి తన అన్న రమేష్ను చంపితే రూ.1.50 లక్షలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నారు. ఇందుకోసం మరో ఇద్దరు బండ మిది తిమ్మప్ప, బోయ నాగేంద్ర సహకారం తీసుకోవాలని భావించారు. హత్య కోసం ప్రత్యేకంగా వేట కొడవళ్ళు చేయించి రమేష్ను చంపాలని పథకం వేసుకున్నారు. అందులో భాగంగా పది రోజుల కిందట మహేశ్ అన్న రమేశ్ను వెంకటపురం స్టేజ్ నుంచి యాపదీన్నేకు వెళ్తుండగా బోలెరోతో ఢీ కొట్టి చంపుదాం అనుకున్నారు.. కానీ కుదరలేదు.
ఇక ఈ నెల 12వ తేదిన ఓ కేసు విషయమై అలంపూర్ కోర్టుకు హాజరయ్యాడు రమేష్. అక్కడ పని అయిపోగానే తాను నివాసం ఉంటున్న యాపదిన్నే గ్రామానికి తన మామ సుధాకర్తో కలిసి బైక్పై బయలుదేరాడు. ముందు నుంచే రమేష్ను మహేష్, బోయ నరసింహులు కారులో వెంబడిస్తూ వచ్చారు. బోయ నరసింహులు బంధువులు బండి మీద.. తిమ్మప్ప, బోయ నాగేంద్రలు బొలెరో వాహనంలో అనుసరించి అనుకున్న ప్రకారం మద్దూరు స్టేజీ దగ్గర బోలెరో వాహనంతో రమేశ్ మోటార్ సైకల్ను ఢీ కొట్టారు. అనంతరం రమేశ్, మామ సుధాకర్లు బైక్పై నుంచి కింద పడిపోయారు. ఇక కారులో ఉన్న మహేశ్, బోయ నరసింహులు వేట కొడవలితో రమేష్ గొంతు నరికి చంపారు. రమేష్ మామ సుధాకర్పై దాడి చేయడంతో ఆయన అపస్మారక స్థితిలో పడిపోయాడు. నిందితులు అదే కారులో అక్కడ నుంచి పారిపోయారు.
తీవ్ర కలకలం రేపిన ఘటనపై గద్వాల్ డీఎస్పీ వై.మోగిలయ్య స్వీయ పర్యవేక్షణలో శాంతినగర్ సీఐ టాటాబాబు ఆద్వర్యంలో ప్రత్యేక టీమ్ను ఏర్పాటు చేశారు. CC కెమెరాలు, ఇతర ఆధారాలతో నిందితులను గుర్తించారు. పరారీలో ఉన్నవారిపై నిఘా ఉంచి.. హైదరాబాద్కు కారులో వెళ్తుండగా జాతీయ రహదారిపై జల్లపూర్ RTA చెక్ పోస్ట్ వద్ద నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి ఒక కారు, మూడు కత్తులు, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి